సిరా న్యూస్,బెంగాల్;
బెంగాల్లో దీదీ హవా కొనసాగుతున్నది. స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా సింగిల్ హ్యాండ్తో తడాఖా చూపిస్తా అన్నట్టుగా తృణమూల్ కాంగ్రెస్ దూసుకుపోతున్నది. మూడొంతుల సీట్లల్లో ఆధిక్యత కనబరుస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 42 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 32 సీట్లల్లో టీఎంసీ లీడ్లో ఉన్నది. బీజేపీ 9 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ కూటమి ఒక్క స్థానంలో ముందంజలో ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ బీజేపీ హవా కనిపిస్తున్న ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ మాత్రం కమలదళానికి అడ్డుకట్ట వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగే పార్లమెంటు ఎన్నికల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటుతున్నది.2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వందిమాగదుల శక్తిని ఒడ్డింది. కేంద్రమంత్రులంతా క్యూ కట్టి మరీ బెంగాల్లో ప్రచారం చేశారు. కానీ, దీదీని తట్టుకోలేకపోయారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అంతకు ముందు కంటే ఒక్క సీటు కూడా తగ్గకుండా పైపెచ్చు మరో సీటు పెంచుకుని టీఎంసీ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల అనంతరం, రాష్ట్రంలో అల్లర్లు రేగాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు సందేశ్కాలి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది టీఎంసీని దెబ్బతీస్తుందని అనుకున్నారు. కానీ, ఆ తర్వాత ఘటన గురించి భిన్నమైన వాస్తవాలు ముందుకు వచ్చాయి. దీదీ ఎప్పటిలాగే తన హవాను కొనసాగించారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ టీఎంసీ తన మార్క్ రిజల్ట్ను తెచ్చుకునే అవకాశాలు ఉన్నట్టు ఫలితాల సరళి ద్వారా తెలుస్తున్నది. దీంతో ఫైర్ బ్రాండ్ దీదీని అడ్డుకోవడం అంత సులువు కాదని, స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా ఆమె జైత్రయాత్ర కొనసాగిస్తారనే అంచనాలు వస్తున్నాయి.
==================