Fisherman Death in Kadem: చేపల వేటకు వెళ్లి.. అనంత లోకాలకు…

సిరా న్యూస్, కడెం:

చేపల వేటకు వెళ్లి.. అనంత లోకాలకు…

+ కాళ్లకు వల చిక్కుకొని నాగుల నరసింహ మృతి
+ కడెం ప్రాజెక్ట్‌లో చేపలు పడుతుండగా ప్రమాదం
+ గతేడాది అనారోగ్యంతో నరసింహ భార్య మృతి
+ తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో అనాథగా మారిన ముగ్గురు పిల్లలు

చేపల వేట ఒకరి ప్రాణం తీసింది. ఎప్పటిలాగే నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్ట్‌లో చేపల వేటకు వెళ్లిన నాగుల నరసింహ(45) చేపలు పడుతుండగా, కాళ్లకు వల చుట్టుకొని నీటిలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. కడెం ఇంచార్జీ ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి, ఏఎస్‌ఐ దేవ్‌ల వివరాల ప్రకారం.. బేస్తవాడకు చెందిన నరసింహ కడెం ప్రాజెక్ట్‌లో చేపలు పడుతూ జీవనం సాగించేవాడు. గత ఏడాది అతని భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో తన ముగ్గురు పిల్లలతో కలిసి కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే శుక్రవారం సైతం కడెం ప్రాజెక్ట్‌లో చేపల వేటకు వెళ్లాడు. చేపలు పడుతుండగా వల కాళ్లకు చుట్టుకోవడంతో నీళ్లలో పడిపోయి, మునిగిపోయాడు. అయితే తెప్ప మీద నరసింహ కనిపించకపోవడంతో తోటి జాలరులు అతని కోసం నీళ్లలో గాలించారు. కొంత దూరంలో నీళ్లలో మునిగిపోయి కనిపించడంతో అతన్ని తెప్పపైకి తీసుకొని వచ్చారు. కానీ అప్పటికే మృతి చెంది ఉండటంతో వారు స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే సంవత్సరం వ్యవధిలోనే తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *