పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్షా కేంద్రం వరకు ఉచిత ప్రయాణ అవకాశం

ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ జిల్లా అధికారి టి.శ్రీనివాసులు

సిరా న్యూస్,కర్నూలు;
జిల్లాలో పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు తమ నివాస స్థలం నుంచి పరీక్షా కేంద్రం వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రజా రవాణా శాఖ జిల్లా అధికారి టి శ్రీనివాసులు తెలిపారు. ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం ఈ అవకాశం కలిపి స్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల వద్ద ఎలాంటి బస్సు పాస్ లేనప్పటికీ పరీక్ష రాసే విద్యార్థులు తమ ఒరిజినల్ హాల్ టికెట్ ను బస్సు కండక్టర్కు సూపించి తమ నివాస స్థలం నుంచి పరీక్ష కేంద్రం వరకు పల్లె వెలుగు బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పరీక్ష అనంతరం పరీక్షా కేంద్రం నుంచి వారి నివాస స్థలం వరకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించినట్లు వివరించారు. అయితే ఈ ఉచిత ప్రయాణం కేవలం పరీక్ష జరిగే తేదీల్లో ,పరీక్ష సమయాల్లో మాత్రమే అనుమతించబడుతుందని ఆయన వివరించారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక తేదీని సెలవు దినంగా ప్రకటించినప్పటికీ ఆ తేదీల్లో పరీక్ష ఉన్నట్లయితే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తామని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి టి శ్రీనివాసులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *