సిరా న్యూస్;
కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ…నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం ఉన్నవారు, పార్టీ సీనియర్ నేతలు హస్తం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కొందరు రాహుల్ గాంధీ నాయకత్వంపై తప్పు పడుతూ రాజీనామా చేస్తున్నారు. మరికొందరేమో కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా బయటకు వెళ్లిపోతున్నారు. హస్తం పార్టీని వీడిన నేతల చిట్టా తిరగేస్తే…భారీగా ఉంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీని వీడి…ఆ పార్టీ గెలుపు ఆశలపై దెబ్బ కొట్టారు. రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తుంటే… ఆయన స్నేహితుడు, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవ్రా పార్టీకి గుడ్ బై చెప్పారు. 2012-2014 మధ్య నౌకాయాన శాఖా మంత్రిగా, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా పని చేశారు. ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనలో చేరిపోయారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు…రాహుల్ గాంధీతో సన్నిహితంగా మెలిగిన ఆర్పీఎన్ సింగ్, జితిన్ ప్రసాద హస్తం పార్టీకి రాం రాం చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరప్రదేశ్లో మంచి పట్టున్న ఆర్పీఎన్ సింగ్…2022 జనవరిలో ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పార్టీని వీడారు. మరో కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద కూడా అదే దారిలో నడించారు. రాహుల్ గాంధీ టీమ్లో పని చేసిన ఆయన యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి…కాషాయ పార్టీలో చేరిపోయారు.రాహుల్ గాంధీతో అత్యంత సన్నిహితంగా మెలిగిన నేతల్లో జ్యోతిరాదిత్య సింధియా ముందు వరుసలో ఉండేవారు. 2020లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కమల్నాథ్కు అప్పగించడంతో… ఆగ్రహంతో రగిలిపోయారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి…బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో విమానయాన శాఖా మంత్రిగా పని చేస్తున్నారు జ్యోతిరాదిత్య సింధియా. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగిన సునీల్ జాఖఢ్ 2022లో పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్కు రాజీనామా చేసి… బీజేపీలో చేరిపోయారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకున్నారు. అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత అశ్వనీ కుమార్…2022 ఫిబ్రవరిలో హస్తం పార్టీకి బై బై చెప్పేశారు. ఎంపీ, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా పని చేసిన కెప్టెన్ అమరీందర్…పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు…కాంగ్రెస్కు షాకిచ్చారు. గుజరాత్కు అసెంబ్లీ ఎన్నికల ముందు హర్దిక్ పటేల్, ఆల్పేష్ ఠాకూరు హస్తం పార్టీకి ఝలక్ ఇచ్చారు. గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్ను 2019లో…రాహల్ గాంధీ పార్టీలోకి తీసుకొచ్చారు. 2022లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తూ రాజీనామా చేశారు. ఊహించని విధంగా బీజేపీలో చేరి…ఆ పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన హిమంత బిశ్వ శర్మ…ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్న కారణంతో పార్టీని వీడారు. ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ అంటోని కూడా బీజేపీలో చేరారు. గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ బయటకు వెళ్లిపోయారు. క్రిష్ణ తీర్థ్, ఛౌదరీ బీరేందర్ సింగ్, మహారాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్ రంజిత్ దేశ్ముఖ్ గుడ్ బై చెప్పారు. మరో వైపు లోక్ సభ ఎన్నికలకుముందు ఇండియా కూటమి నేతలు ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారని, కాంగ్రెస్ నేతలను పాపులుగా అభివర్ణిస్తూ అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మవ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రధాని మోదీని వ్యతిరేకించేందుకే కూటమి ఏర్పడిందని అన్నారు. “ఇండియా కూటమి ఓ సోప్ ఒపెరా. అందులో నేతలు వినోదాన్ని పంచుతుంటారు. ఉదయం ఒకరు, సాయంత్రం ఒకరు అలక చెందుతారు. మోదీని టార్గెట్ చేయడమే కూటమి పని. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టకుండా కుట్రలు చేసింది. బాబర్ వారికి అత్యంత ప్రీతిపాత్రుడు.బాబర్ దగ్గరకు వెళ్లడం కాంగ్రెస్ కి నచ్చింది. కానీ రాముడి దగ్గరికి రావడం నచ్చలేదు. వారు పాపులు. పాపులుగానే మిగిలిపోతారు. వారిని రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం తప్పు. రాముడిపై విశ్వాసం ఉన్నవారిని మాత్రమే ఆహ్వానించాలి. రాముడు, బాబర్ పక్క పక్కన ఉంటే కాంగ్రెస్ నేతలు తొలుత బాబర్ కే నమస్కరిస్తారు. అసోం సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి కన్వీనర్ పదవిని తిరస్కరించారు. ఇలాంటి వినోదాన్ని పంచే వార్తలు ఎన్నికలు జరిగే వరకూ వస్తూనే ఉంటాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నారు. రాముడికి అన్యాయం చేసిన వ్యక్తి దేశానికి ఏం న్యాయం చేస్తారు” అని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే హిమంత తాజా కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.