తెలంగాణలో ఫుల్..ఫుల్ గా దావత్…

సిరా న్యూస్,వరంగల్;
లోక్‌ సభ ఎన్నికలకు నాలుగు వారాలే మిగిలి ఉంది. సమయం లేదు మిత్రమా ఓటింగ్‌ సమయం దగ్గర పడుతోంది. దీంతో అప్రమత్తమైన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా మారిపోయారు. ముఖ్యంగా గ్రేటర్‌ జిల్లాల పరిధిలోని మల్కాజ్‌ గిరి, సికింద్రాబాద్‌, చేవెళ్ల, హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల్లోని అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒక వైపు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ మరోవైపు వీలైనంత త్వరగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు.ఉదయం ఇతర పార్టీల కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తూ, వారికి కండువా కప్పడం. మధ్యాహ్నం బూత్‌, గ్రామ, మండల స్థాయి కమిటీలతో ఆత్మీయ సభలు, సమావేశాలు నిర్వహించి, ఎన్నికల్లో గెలుపు కోసం సమాలోచనలు చేయడం. సాయంత్రం ఏడు తర్వాత ముఖ్య అనుచరుల నివాసాలు, గెస్ట్‌ హౌసులు, ఆఫీసులు, హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, ఫాం హౌసుల్లో గెట్‌ టు గెదర్‌ పార్టీలు ఏర్పాటు చేయడం నిత్యకృత్యమైంది. కాలనీ, అపార్ట్‌మెంట్‌, గేటెడ్‌ కమ్యూనిటీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, యువజన సంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. వివిధ రకాల మాంసాహార వంటకాలతో పాటు ఖరీదైన మద్యం బాటిళ్లను సరఫరా చేస్తున్నారు. ఒక వైపు అభ్యర్థి గెలుపునకు ఏ విధంగా కృషి చేయాలనే అంశంపై చర్చిస్తూనే మరో వైపు ‘సుక్క-ముక్క’తో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఒకే చోట ఎక్కువ మంది కూడితే ఎన్నికల కమిషన్‌కు అనుమానం వస్తుందని భావించి, పోలింగ్‌ బూత్‌ల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా పుట్టిన రోజు వేడుకల బ్యానర్లను, కేకు, పుష్పగుచ్ఛాలను ఆ ప్రదేశంలో రెడీగా ఉంచుతున్నారు. ఎన్నికల్లో ప్రచారం కోసం బంధువులు, స్వగ్రామాలకు చెందిన వారిని కూడా నియోజకవర్గానికి రప్పించి, వారితో మంతనాలు జరుపుతున్నారు. స్థానికంగా స్థిరపడిన వారి బంధువుల ఓట్లు తమకే పడేలా ప్లాన్‌ చేస్తున్నారు.కనీసం ఏ ఒక్క రోజు కూడా పలకరించని నేతలు ఏకంగా ఇంటికి, గెస్ట్‌ హౌస్‌కు, హోటల్‌కు, క్యాంపు ఆఫీసుకు పిలిపించుకుని విజయం కోసం పాటు పడాల్సిందిగా వేడుకుంటున్నారు. బస్తీ లీడర్లు కూడా దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. అభ్యర్థుల ముందు అనేక ప్రతిపాదనలను పెడుతున్నారు. సామాజిక వర్గం, హోదా, సంస్థాగతంగా ప్రజల్లో తనకు ఉన్న పలుకు బడికి ఓ రేటు నిర్ణయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో అభ్యర్థులు వారి డిమాండ్లను అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా చేవెళ్ల, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి లీడర్లకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది.ఎన్నికల్లో మద్యం పంపిణీని నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్‌ గట్టి చర్యలే చేపట్టింది. గెట్‌ టు గెదర్‌ పార్టీలకు నేరుగా మద్యం సరఫరా చేస్తే పోలీసులు పట్టుకునే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఎవరికీ అనుమానం రాకుండా ముందే తమ అనుచరులు, బంధువులు, బినామీల పేరుతో ఉన్న వైన్స్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు ప్రత్యేకంగా టోకెన్లును కూడా ముద్రించి ఇస్తున్నారు.అభ్యర్థి వెంట రోజంతా తిరిగిన ముఖ్య అనుచరులతో పాటు ఇతర నిర్వాహకులకు సాయంత్రం వేళ టోకెన్లు జారీ చేస్తున్నారు. వీరు ఆయా వైన్ షాపుల వద్దకు వెళ్లి కావాల్సినంత మద్యాన్ని వెంట తీసుకెళ్తున్నారు. ఆత్మీయ సభలు, సమావేశాలకు హాజరయ్యే వారికి కూడా ఇదే విధంగా పంపిణీ చేస్తున్నారు. ఎక్సైజ్ ‌శాఖ జిల్లాలోని వైన్ షాపుల్లోని నిల్వలను ఏ రోజుకారోజు లెక్కిస్తున్నప్పటికీ వీరి లెక్కకు ఏమాత్రం కూడా చిక్కకుండా వ్యవహారం నడుస్తోంది. అంతేకాదు కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరయిన సభ్యులను బట్టి బాటిళ్లను, బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు.
=====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *