ఇష్టపడి చదివితేనే లక్ష్యాలను చేరుకోవచ్చు

నిట్ ప్రొఫెసర్ కొత్త లక్ష్మారెడ్డి

సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి :
గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో సిరి ఫంక్షన్ హాల్ లో వరంగల్ లోని నిట్ లో పనిచేసిన ప్రముఖ విశ్రాంత ప్రొఫెసర్ కొత్త లక్ష్మారెడ్డి గారిచే పాఠశాలలోని 8, 9, 10 వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఏ విషయంలోనైనా వంద శాతం పరిపూర్ణులు కారు అనీ, ప్రతి ఒక్కరికీ కొన్ని తెలియని విషయాలు కూడా ఉంటాయన్నారు. కానీ మనం కష్టపడి చదువుతూ ఆయా విషయాల పట్ల అవగాహన పెంచుకుంటూ, మన జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకునే అవకాశం మాత్రం ఉందన్నారు. ఈ క్రమంలో ఆయన థర్మో డైనమిక్స్ సూత్రాలను మన నిత్య జీవితానికి అన్వయిస్తూ చెప్పిన ఉదాహరణలు విద్యార్థులను ఆలోచింపజేసాయి. పిల్లలందరూ జ్ఞానాన్ని ఆర్జించాలనే ఒక తృష్ణతో నిరంతరం అభ్యసనం చేస్తూ ఉంటేనే మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుందన్నారు. అనంతరం గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లెంకి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులలో విద్య పట్ల, తమ తమ లక్ష్యాల సాధన పట్ల ప్రేరణ కలిగించేలా చేయడానికి ఈ రోజు ప్రముఖ రసాయన శాస్త్ర రిటైర్డ్ ప్రొఫెసర్ ని మా పాఠశాలకు ఆహ్వానించడం జరిగిందన్నారు. ఆయన చెప్పిన విషయాలను అందరూ అవగాహన చేసుకొని, నిర్దేశిత లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని అల్లెంకి మహాలక్ష్మి కళ్ళకు గంతలు కట్టుకొని వివిధ వస్తువుల పేర్లు, రంగును కేవలం వాసన ద్వారా కనుగొని చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, రమేష్ బాబు, లింగేశ్వర్, రిజ్వాన్, స్రవంతి, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *