సిరా న్యూస్,గుంటూరు;
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈరోజు తన నిర్ణయాన్ని ప్రకటించారు. గత కొద్దిరోజులుగా ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో రకరకాల ప్రచారం జరిగింది. ఒకానొక దశలో వైసీపీలో చేరతారని కూడా టాక్ నడిచింది. కానీ ఈ ఊహాగానాలకు తెర దించుతూ గల్లా జయదేవ్ కీలక ప్రకటన వెల్లడించారు. రాజకీయాలకు దూరం కానున్నట్లు ప్రకటించారు. గల్లా జయదేవ్ ది సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. గత ఐదు దశాబ్దాలుగా ఆ కుటుంబం క్రియాశీలక రాజకీయాల్లో ఉంది. తల్లి గల్లా అరుణకుమారి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయదేవ్ రెండుసార్లు గుంటూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. మూడోసారి బరిలో దిగి హ్యాట్రిక్ కొడతారని అంతా భావించినా.. ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతానని నిర్ణయించుకున్నారు.
గల్లా జయదేవ్ తల్లి అరుణకుమారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉండేవారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేవారు. 2014 ఎన్నికలకు ముందు ఆ కుటుంబం టిడిపిలో చేరింది. గల్లా జయదేవ్ కు చంద్రబాబు గుంటూరు లోక్ సభ స్థానం టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో జయదేవ్ విజయం సాధించారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం జయదేవ్ మరోసారి ఎంపీగా గెలిచారు. పార్లమెంట్ లో ఏపీ విభజన హామీలు అమలు చేయాలని జయదేవ్ గట్టిగానే నిలదీశారు. అమరావతికి మద్దతుగా పార్లమెంట్ లో గట్టిగానే మాట్లాడేవారు.అటువంటి నాయకుడు ఇటీవల సైలెంట్ అయ్యారు. రాజకీయంగాను కనిపించకుండా పోయారు. దీంతో ఆయన టిడిపిని వీడుతారని ప్రచారం జరిగింది. అయితే ఏకంగా రాజకీయాలని విడిచిపెడుతున్నట్లు ఆయన తాజాగా ప్రకటించడం విశేషం.అమెరికాలో స్థిరపడిన గల్లా కుటుంబం చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీని ఏర్పాటు చేసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించింది. అయితే కాలుష్య కారణాలు చూపుతూ వైసిపి ప్రభుత్వం అమర్ రాజా కంపెనీని ఇబ్బందులు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అందుకే కంపెనీ ఉత్పత్తుల విస్తరణ యూనిట్ ను తెలంగాణకు తరలించినట్లు ప్రచారం జరిగింది. ఈ తరుణంలోనే జయదేవ్ రాజకీయంగా దూకుడు తగ్గించారు. కేవలం వైసీపీ సర్కార్ ఇబ్బందులు పెట్టడం వల్లే వ్యూహాత్మక మౌనం పాటించినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు రాజకీయ విరమణ ప్రకటనతో అదే అర్థం వచ్చేలా జయదేవ్ మాట్లాడడం విశేషం.2024 ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తే గెలిపించేందుకు గుంటూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జయదేవ్ చెప్పుకొచ్చారు. పార్లమెంట్ లో 24 శాతం మంది వ్యాపారవేత్తలు ఉన్నారని.. ప్రభుత్వపై పోరాడితే వ్యక్తిగతంగా వ్యాపారాలను దెబ్బతీసే అవకాశం ఉందని.. అయినా భయపడకుండా చట్టబద్ధంగా పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. నిజాయితీగా ఉండే నాయకులు రాజకీయాల్లోకి వస్తే సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచి పార్లమెంట్లో సైలెంట్ గా కూర్చోవడం తన వల్ల కాదని తేల్చేశారు. ప్రస్తుతానికి ఫుల్ టైం పొలిటీషియన్ గా మారలేనని.. వ్యాపారాలపై దృష్టి పెడతానని.. అవకాశం వస్తే పూర్తిస్థాయిలో రాజకీయ నాయకుడిగా మారుతానని కూడా జయదేవ్ తేల్చి చెప్పారు. మొత్తానికి అయితే ఏపీ రాజకీయాల నుంచి గల్లా కుటుంబం గౌరవంగా తప్పుకున్నట్లేనని తేలింది. కాగా గుంటూరు ప్రజలకు ఆదివారం జయదేవ్ ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి నారా లోకేష్ హాజరు కావడం విశేషం.