దసరా తర్వాత మహిళలకు గుడ్ న్యూస్

సిరా న్యూస్,వరంగల్;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ మీదున్నారు. ఆయన వరసగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారు. ఆరు గ్యారంటీలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వరసగా వాటిని అమలు చేస్తూ వెళుతుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందచేస్తున్నారు. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును అమలు చేస్తున్నారు. అయితే తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికే ఈ పథకాన్ని అందచేస్తున్నారు. తాజాగా రైతు రుణమాఫీని రెండు లక్షల రూపాయల వరకూ మాఫీ చేసి అమలు చేశారు. ఆగస్టు 15వ తేదీతో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తారు.. ఇప్పటికే అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటి పోతుండటంతో రేవంత్ రెడ్డి మిగిలిన హామీల్లో ఒక్కొక్కదానిని అమలు చేయాలని నిర్ణయించారని తెలిసింది. అందులో ముఖ్యమైనది మహిళలకు ప్రతి నెల రెండు వేల రూపాయల సాయం ప్రకటిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద ఇది ఒక్కటే మిగిలి ఉంది. ఇందుకు అర్హులైన మహిళల జాబితాలను సిద్ధం చేయాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశాలను జారీ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు అధికారులు ఎంత మంది మహిళలకు నెలకు రెండు వేల రూపాయలు ఇవ్వాలి? ఖజానా పై ఎంత భారం పడుతుందన్న లెక్కలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. రేషన్ కార్డుల జారీ తర్వాత… మరోవైపు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తులు చేస్తుంది. అది పూర్తయిన వెంటనే తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో మహిళలందరికీ నెలకు రెండు వేల రూపాయలు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇది వరకే వేరే రకమైన పింఛను తీసుకుంటున్న వారికి ఈస్కీమ్ వర్తించదు. ఎటువంటి పింఛను తీసుకోకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు నెలకు రెండు వేల రూపాయలు ఇచ్చే పథకానికి ప్రియాంక గాంధీ చేత చేయించాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. నిజంగా ఇది మహిళలకు శుభవార్తే కదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *