సిరాన్యూస్, ఓదెల
అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం సాధించిన గట్టు సౌమ్య
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లోని గుంపుల ప్రభుత్వ పాఠశాలలో 2012వ సంవత్సరంలో10వ తరగతి విద్యను అభ్యసించిన గట్టు సౌమ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షలో నెగ్గి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఈమె గుంపుల గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన కీ. శే. గట్టు రాములు, సునీత దంపతుల రెండో కుమార్తె సౌమ్య. స్తానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి పదవ తరగతిలో అత్యధిక జిపిఏ సాధించి బాసరలోని ట్రిపుల్ ఐటీ లో సీటు పొంది బీటెక్ పూర్తి చేసింది. అనంతరం జేఎన్టీయూలో ఎంటెక్ సైతం పూర్తి చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయి పంచాయితీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాన్ని సాధించింది. మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక ఇంజనీరుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల పలువురు హర్షం ప్రకటించారు. తమ పాఠశాల పూర్వ విద్యార్థిని గట్టు సౌమ్య పట్టుదలతో శ్రమించి కఠినమైన పోటీ పరీక్షల్లో నెగ్గి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల గుంపుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సారంగపాణి ఉపాధ్యాయ బృందం ఆమెకు అభినందనలు తెలియజేశారు.