సిరాన్యూస్, ఆదిలాబాద్
ఈవీఎంల భద్రత పోలీసుల బాధ్యత : ఎస్పీ గౌష్ ఆలం
ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలి
* శిక్షణ కానిస్టేబుళ్లు, కేంద్ర బలగాలకు ఎన్నికల విధులపై అవగాహన
* సూచనల సంచిక అందజేత
ఈవీఎంల భద్రత పోలీసుల బాధ్యత అని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగవ విడతలో భాగంగా ఈనెల 13న నిర్వహించనున్న పోలింగ్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధులను నిర్వహించబోతున్న నూతన శిక్షణ కానిస్టేబుల్, కేంద్ర బలగాలకు శనివారం జిల్లా ఎస్పీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు శిక్షణ కేంద్రం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని సిబ్బందికి పోలింగ్ స్టేషన్ల వద్ద, ఎన్నికల నిర్వహణ పట్ల, జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 87 రూట్లు వాటి లో చేయవలసిన విధుల పట్ల, మొబైల్ పార్టీల, పోలింగ్ సమయం పట్ల వివిధ అంశాలతో కూడిన పూర్తి అవగాహనను సిబ్బందికి శిక్షణ ద్వారా అందించారు. ఏ ఏ విధుల్లో సిబ్బంది చేయవలసిన సూచనలతో కూడిన ఒక సంచికను ప్రతి ఒక్క సిబ్బందికి అందజేశారు. సిబ్బందికి ఎటువంటి అనుమానాలు ఉన్న పుస్తకంలో చూసి నివృత్తి చేసుకోవాలని తెలియజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన సమయం ప్రకారం మే 13 న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడుతుందని తెలియజేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రజలకు 100 మీటర్ల పరిధిలో గూమి కూడకుండా, ప్రజలు క్రమబద్ధీకరణతో క్యూలైన్లను పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాలని సూచించారు. పోలింగ్ బూత్ లోపలికి మొబైల్ ఫోన్లను, మంట కలిగించే వస్తువులకు అనుమతి లేదని ప్రజలకు తెలియచేయాలని సూచించారు. పోలింగ్ సెంటర్ లోపలికి ఓటర్ స్లిప్పు, ఐడి కార్డులు లాంటి వాటిని అనుమతించాలని సూచించారు. సిబ్బంది ఎండలు మండుతున్న నేపథ్యంలో ఓఆర్ఎస్ , మంచినీటిని ఎక్కువ గా సేవించి తమ ఆరోగ్యాలని కాపాడుకోవాలని సూచించారు. ఎటువంటి అత్యవసర సమయంలోనైనా మీకు త్వరగా అందుబాటులో ఉండే రూట్ మొబైల్ పార్టీలను సంప్రదించాలని , లేనిపక్షంలో స్ట్రైకింగ్ ఫోర్స్ , స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ప్రతి ఒక్క సిబ్బంది వద్ద తాము నిర్వహించే పోలింగ్ స్టేషన్ పరిధిలో వచ్చే ఉన్నతాధికారుల మొబైల్ నెంబర్లను ముందుగానే తీసుకోవాలని సూచించారు. చివరగా పోలీసుల ముఖ్య బాధ్యత ఈవీఎంలను సురక్షితంగా కాపాడటం అని గుర్తు చేశారు. రూట్ మొబైల్స్ లో సిబ్బంది రిసెప్షన్ సెంటర్కు వచ్చేంతవరకు అప్రమత్తంగా ఉంటూ తమ విధులను పూర్తిగా నిర్వర్తించాలని సూచించారు. అదేవిధంగా కేంద్ర బలగాలైన సిఏపిఎఫ్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రిటికల్ , మావోయిస్టు ప్రభావిత పోలింగ్ స్టేషన్లో వద్ద అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని తెలియజేశారు. పోలింగ్ పూర్తి అయిన తరువాత స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత లో కేంద్ర బలగాలను వినియోగించునున్నట్లు, భద్రతలో వారి బాధ్యత కీలకంగా ఉండబోతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు సి సమైజాన్ రావు, బి సురేందర్రావు, డీఎస్పీలు బి ప్రకాష్, ఎల్ జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, సిఐకే సత్యనారాయణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.