సిరాన్యూస్, ఆదిలాబాద్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు : ఎస్పీ గౌష్ ఆలం
* కౌంటింగ్ వరకు 24 గంటల భద్రత
* స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ
ఆదిలాబాద్లో పార్లమెంట్ ఎన్నికల ఈవీఎలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా చర్యలను మంగళవారం జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి తగు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మూడు ప్రాంతాలలోని స్ట్రాంగ్ రూములలో భద్రపరిచినట్లు తెలిపారు. ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచల భద్రత కొనసాగుతుందని చెప్పారు. అందులో మొదటి వలయంలో కేంద్రబలగాలైన సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ తో పహారా, రెండవ భాగంలో జిల్లా రిజర్వ్ పోలీసు తో పహారా, మూడవ భాగంలో పట్టణ పోలీసులతో గస్తీ నిర్వహిస్తూ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. కౌంటింగ్ జరిగే వరకు ఈ భద్రత ఇలాగే కొనసాగుతున్న తెలిపారు. భద్రతలో భాగంగా వర్షాలు, ఈదురు గాలులు లాంటి ఆపత్కాల ఘటనలకు తట్టుకునే విధంగా గట్టి రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ స్ట్రాంగ్ రూములకు ఉమ్మడి జిల్లాల పోలీస్ అధికారులను భద్రత ఇన్చార్జిలుగా నియమించినట్లు తెలిపారు. అదనపు రక్షణ చర్యల్లో భాగంగా సీసీటీవీ కెమెరాలను అమర్చి నిరంతరం పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. స్ట్రాంగ్ రూములను సందర్శించే ప్రతి ఒక్కరి సంతకం భద్రత అధికారులు రిజిస్టర్లో నమోదు చేసుకోవాలని, సందర్శించిన సమయం, వెళ్లిన సమయం, నమోదు చేయాలని సూచించారు. ఏ సమయంలోనైనా ఆకస్మిక తనిఖీలు జిల్లా కలెక్టర్ , ఎస్పీల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయని, ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాలలో మూడు చోట్ల భవనాల చుట్టూ పెట్రోలింగ్, గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.