సిరాన్యూస్, ఆదిలాబాద్
యోగాతో మానసిక ప్రశాంతత: ఎస్పీ గౌష్ ఆలం
* పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు
* జిల్లా వ్యాప్తంగా పోలీసు కార్యాలయాల్లో యోగా నిర్వహణ
ప్రతీ రోజు యోగా చేయడం వలన అనారోగ్య సమస్యలు దూరం కావడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. శుక్రవారం ప్రపంచ పదవ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటుచేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ పాల్గొని సిబ్బందితో కలిసి యోగా నిర్వహించారు. మొదటగా యోగా శిక్షకుడు కానిస్టేబుల్ సామ రాజు యోగ ను సిబ్బందికి తెలియజేస్తూ, సూర్య నమ స్కారాలు, ప్రాణాయామము, ఆసనములు సిబ్బంది ద్వారా చేయించారు.యోగా దినోత్సవం లో భాగంగా జిల్లా ఎస్పీ తో సహా సిబ్బంది అందరూ వివిధ రకాల సూర్య నమస్కారాలు, ఆసనములు, వివిధ రకాల ప్రాణాయాములు స్వయంగా చేశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశిస్తూ జిల్లా ఎస్పీ మాట్లాడారు. మొదటగా సిబ్బందికి పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశంలో యోగా పుట్టడం మన అందరి అదృష్టంగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. యోగ అనేది వయసుకు సంబంధం లేకుండా అందరూ చేసే ఒక సాధనమని తెలిపారు. యోగా వల్ల, ఆసనాల వల్ల అనారోగ్య బారిన పడకుండా, శారీరక దృఢత్వాన్ని కాపాడుతూ ఉండవచ్చని చెప్పారు. ముఖ్యంగా పోలీసులు రేయింబవళ్లు 24 గంటలు విధులను నిర్వర్తిస్తుంటారని వారికి యోగ ఎంతగానో తోడ్పాటు అందజేస్తుందని, ఆరోగ్యాన్ని కాపాడుతూ విధులను నిర్వర్తించాలని సూచించారు. యోగ ప్రాణాయామము ఆసనాలు వలన మానసిక, శరీరక విశ్రాంతి, ఉపశమనం లభించి ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. గుండెకు, శరీరానికి, మనసుకు అన్నిటికీ యోగ ఉత్తమమైన మార్గమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు కార్యాలయాల్లో సిబ్బంది యోగా దినోత్సవం నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్ చంద్రశేఖర్, పట్టణ పోలీసులు, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.