గ్రేటర్ లొ విలీనమైన కంటోన్మెంట్ బోర్డు

 సిరా న్యూస్,హైదరాబాద్;
ఎట్టకేలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాను జీహెచ్ఎంపీలో విలీనం చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం పౌర ప్రాంతాలను విలీనం అవుతాయి.ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ జీహెచ్ఎంసీకి బదిలీ అవుతాయి. మిలటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్‌లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరించనుంది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగావున్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కనున్నాయి. ఆయా ప్రాంతాలను విభజించేటప్పుడు బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విలీనం ప్రక్రియను పూర్తి చేయాలని రక్షణశాఖ అదనపు డైరెక్టర్ జనరల్ హేమంత్ యాదవ్ ఈనెల 28న బోర్డు సీఈవోకు ఉత్తర్వులు జారీ చేశారు.కేంద్రం ఉత్తర్వులు ప్రకారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని దాదాపు 2,670 ఎకరాల భూమి జీహెచ్ఎంసీకి బదిలీ కానుంది. అందులో 350 రెసిడెన్షియల్ కాలనీలు, 16 బజార్లు, 414 ఎకరాల కేంద్ర ప్రభుత్వ భూమి, 501 ఎకరాల లీజుకు తీసుకున్నవి ఉన్నాయి. ప్రస్తుతం 260 ఎకరాల ఖాళీ భూములున్నాయి. బ్రిటీష్ కాలం నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ రాస్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇటీవలే కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాశారు. ఈనెల 25 కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లోనూ విలీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కేంద్ర రక్షణ శాఖ అందుకు సంబంధించిన విధి విధానాలపై లేఖ రాశారు. దీని ప్రకారం కంటోన్మెంట్‌ లోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. అక్కడి ప్రజలకు నిర్దేశించిన సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ ఉచితంగా జీహెచ్ఎంసీకి బదిలీ చేస్తారు. కంటోన్మెంట్ బోర్డుల ఆస్తులు, అప్పులన్నీ మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. అక్కడ ఇప్పటికే లీజులు ఇచ్చినవి కూడా మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్‌ మినహా కంటోన్మెంట్ లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తుంది. తన పరిధిలో ఉన్న వాటిపై పన్నులను విధిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కుతాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు, సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంటోన్మెంట్ బోర్డు బాధ్యులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి, తదుపరి కార్యాచరణ చేపట్టాలని సూచించింది. ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకునేందుకు ఎనిమిది వారాల వ్యవధి ఉంటుంది.దీనికి సంబంధించిన కమిటీ రిపోర్టు ఇచ్చాక తుది నిర్ణయం తీసుకుంటామని కంటోన్మెంట్ అధికారులు చెబుతున్నమాట. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేయని ప్రయత్నం లేదు. ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌‌సింగ్ తో పలుమార్లు భేటీ అయ్యారు. మార్చి ఐదున తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *