సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలను విద్యాశాఖ సవరించింది. ఇకపై ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9 గంటలకే ప్రారంభం కానున్నాయి. మరోవైపు, ఉన్నత పాఠశాలలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచే పనిచేస్తాయి. అయితే, వాటి పనివేళలను కూడా ఉదయం 9 గంటలకే మార్చాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే, వచ్చే విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది.గతంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ ఉదయం 9 గంటలకే ప్రారంభయమయ్యేవి. కానీ, 2023 – 24 విద్యా సంవత్సరం నుంచి వీటి సమయాన్ని 9.30 గంటలుగా మార్చారు. అయితే, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉదయం 8 గంటలకే స్కూలు బస్సులెక్కి పోతుంటే, సర్కారు బడి పిల్లలు మాత్రం ఉదయం 9.30 గంటలకు వెళ్లడం వల్ల సర్కారు బడులపై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడుతుందని విద్యాశాఖ అధికారులు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వివరించారు. దీంతో బడి వేళల్లో మార్పులు చేశారు. మరోవైపు.. హైస్కూళ్లను 9.30 గంటలకు తెరిస్తే సాయంత్రం 4.45 గంటల వరకు విద్యార్థులు బడిలోనే ఉండాల్సి ఉంటుందని, దీనివల్ల చలి, వర్షాకాలాల్లో వారు ఇళ్లకు వెళ్లేసరికి ఆలస్యమై, బాలికలకు రక్షణ కరువవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో వీరి బడి సమయాన్ని కూడా మార్చితే ఎలా ఉంటుందనే కోణంలో విద్యాశాఖ అధికారులు
ప్రణాళికలు రచిస్తున్నారు.ఆరు, ఏడు తరగతుల గణితం సబ్జెక్టును ఇక నుంచి భౌతికశాస్త్రం ఉపాధ్యాయులే బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రెండు తరగతులకు గణితం టీచర్లు బోధిస్తే వారిపై పనిభారం పెరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
కేలండర్ ఇదే..
విద్యా సంవత్సరం ప్రారంభం: 2024 జూన్ 12
విద్యా సంవత్సరం లాస్ట్ వర్కింగ్ డే: 2025 ఏప్రిల్ 24
మొత్తం పని దినాలు: 229
వేసవి సెలవులు: 2025 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు (49 రోజులు)
దసరా సెలవులు: అక్టోబర్ 13 నుంచి 25 వరకు (13 రోజులు)
క్రిస్మస్ సెలవులు: డిసెంబర్ 23 నుంచి 27 వరకు
సంక్రాంతి సెలవులు: 2025 జనవరి 12 నుంచి 17 వరకు
పదో తరగతి సిలబస్ పూర్తి చేయాల్సిన తేదీ: 2025 జనవరి 10
1 నుంచి 9వ తరగతి సిలబస్ పూర్తి చేయాల్సిన తేదీ: ఫిబ్రవరి 28
రోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 5 నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు