సిరా న్యూస్,రంగారెడ్డి;
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు పార్థివ దేహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నివాళులర్పించారు.
హరీష్ రావు మాట్లాడుతూ రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శం. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు గారు చిరస్మరణీయులు. పత్రిక, టీవీ, సినిమా తదితర రంగాల్లో రామోజీరావు గారు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణం. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. సమాజ హితం కోసం మీడియా ద్వారా కృషి చేశారు. ఏ రంగంలో అడుగుపెట్టినా తనదైన ముద్ర వేశారు. ప్రతి వ్యాపారంలో అగ్రగామిగా నిలిచారు. ఒక చిరుద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రామోజీ రావు.. వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఎంతో మంది కుటుంబాల్లో వెలుగు నింపారు. తెలుగు భాషను కాపాడేందుకు ఆయన చేసి కృషి ఎంతో గొప్పది. జర్నలిజం, సాహిత్య రంగాల్లో ఆయన చేసిన కృషి గొప్పది. సమాజ సేవ చేసి ఎంతో మంది గుండెల్లో నిలిచిపోయారు. కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతని అన్నారు.