పేరుకే అధికారులు పెత్తనమంతా ఆయనదే…

– ఫైలు కదలానన్నా.. సంతకాలు జరగాలన్న ఆయన మాట కోసం ఎదురుచూపులు…

-ఇటు బ్రోకర్లు అటు అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు కానిస్తున్న నైట్ వాచ్ మెన్

-ఎంవీఐ కార్యాలయంలో పెరిగిన అవినీతి…
– పట్టించుకోని అధికారులు, పాలకులు
 సిరా న్యూస్,పెద్దపెల్లి;

మండల కేంద్రంలో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న కూడా అత్యధికంగా వసూళ్లు చేసుకునే కార్యాలయం ఏదైనా ఉందంటే అది ఎంవీఐ కార్యాలయం మాత్రమే అంటున్నారు పలువురు బాధితులు. ఇక్కడ నేరుగా ఏ పనులు జరగవు… ఆన్ లైన్ వ్యవస్థ ఉన్నా కూడా అంతా ఆఫ్ లైన్ లోనే అన్ని పనులు సాగుతుంటాయి. ఇప్పటికి, ఎప్పటికీ కూడా ఉద్యోగులు, అధికారులు అమ్యామ్యలను వదులుకోవడం ఇష్టం లేకనే కొంతమంది బ్రోకర్ల ద్వారా వ్యవస్థ నడిపిస్తున్నారని అంటు బాధితులు పేర్కొనడం గమనార్హం. ఇక్కడ ఏ ఉద్యోగి, అధికారి స్వయంగా డబ్బులు అడగరు, తీసుకోరు. కేవలం వారి ప్రవర్తన తీరుతోనే మనం అర్ధం చేసుకోవాలి. త్వరగా పని కావాలంటే ఎలా… ఇంకేముంది గత 40 ఏళ్ళుగా ఆ శాఖను నమ్ముకొని జీవనం సాగిస్తున్న చిన్న పాటి బ్రోకర్. ఇప్పుడు ఒక మాహా సామ్రాజ్యమే తనదిగా కార్యాలయంలో పనులు చక్క బెడుతున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు సదరు కార్యాలయం, అధికారులను నమ్ముకొని కోట్లకు పడిగేత్తాడు. ఇటు అధికారులకు, ఉద్యోగులకు వచ్చిన దాంట్లో పంచుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉందంటే అధికారులు అతని మాట దాటి పోరు. సెక్షన్ లో సంతకం చేయాలంటే ఆయన పేరు రావాల్సిందే. గతంలో “ప్రజాక్రాంతి దినపత్రిక”లో వచ్చిన కథనాలకు స్పందించిన ఆ శాఖ అధికారులు సదరు బ్రోకర్ ను ఏకంగా నైట్ వాచ్ మెన్ గా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పెట్టుకున్నారు. మరి వాచ్ మెన్ చేయాల్సిన డ్యూటీ ఏంటయ్యా అంటే ఓవర్ లోడ్ వాహనాలు ఆపి కార్యాలయం కు తరలించడం, అధికారి వాహనంలో సిబ్బంది, అధికారి లేకుండా తిరగడం ఆయన డ్యూటీ. సార్లు మన వారైతే ఆ కిక్కే వేరు అన్నట్లుగా సాగుతున్నది మన బ్రోకర్ హవా. ఇక అసలు విషయంలోకి వస్తే సదరు వాచ్ మెన్ ఆస్తులు ఏకంగా 50 కోట్ల మార్కు దాటిందని అతని దగ్గర బంధువే ఈ మధ్యన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడం గమనార్హం. నైట్ వాచ్ మెన్ జీతం ఎంతుంటుంది మహా అయితే 10 నుంచి రూ. 15 వేలు కావచ్చు. ఇన్నేళ్లలో కోట్ల సంపాదన ఎలా సాధ్యమైందో అధికారులకే తెలియాలి. ఇటు ప్రభుత్వానికి ఆదాయంతో పాటు అటు అధికారులకు బ్రోకర్లకు ఉపాధి చూపిస్తున్న శాఖగా చరిత్రలో నిలిచిపోతున్నది మన పెద్దపల్లి ఎంవీఐ కార్యాలయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు హయాంలో అవినీతి దరి చేరని శాఖగా మార్చే ఉద్దేశంతో ఆన్ లైన్ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. అధికారులు మాత్రం మాకు సంబంధం లేదంటూనే, ఈ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. సెక్షన్ అధికారులు నిర్భయంగా అడుగుతారు ఎవరు మిమ్మల్ని పంపారని. వ్యక్తిగతంగా వస్తే ఇక అంతే సంగతులు. గతంలో వచ్చిన కొద్ధిమంది అధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని పక్కకు పెట్టినా, మళ్లీ కథ మొదటికి వచ్చింది. మేము నిజాయితీగా పనులు చేస్తున్నామని ఓ పక్క డంకా బజాయించి చెప్తున్న అధికారులు ఒక రిజిస్టర్ పెట్టుకొని కార్యాలయంకు వచ్చే వారి వద్ద నుంచి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా, అవినీతి మాటున దాక్కున్నాయి. ఎంత వెసులు ‘వసూలు” గిట్టు బాటుందో. సదరు బ్రోకర్ కు పెద్దపల్లిలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా రెండు షటర్ల బిల్డింగ్, అలాగే రంగపల్లిలో మరో రెండు బిల్డింగులు, కునారం రోడ్డులో మరో బిల్డింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఒక నైట్ వాచ్ మెన్ ఇంత సంపాదిస్తే అధికారులు, ఉద్యోగులు సంగతి ఎలా ఉంటుందో మాటల్లో చెప్ప లేము. ఇలాంటి వారిని పట్టించేలా అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తే కాని ఈ వ్యవస్థ బాగు పాడదేమో….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *