గాంధీ ఆస్పత్ర ముట్టడికి బీఆర్ఎస్ యత్నం… నేతల అరెస్ట్
సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్లోని గాంధీ ఆస్పతి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ గాంధీతో పాటు రాష్ట్రంలోని ఆస్పత్రుల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ నేటి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సిద్ధమైంది. అయితే గాంధీ ఆస్పత్రిని సందర్శించాల్సి ఉండగా.. పోలీసులు ముందస్తుగా రాజయ్యతోపాటు కమిటీ సభ్యులను హౌస్ అరెస్ట్ చేశారు.రాష్ట్రంలో దిగజారిన వైద్య ఆరోగ్య పరిస్థితిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలనే ఉద్దేశంతో వెళ్తుండగా పోలీసులు ముగ్గురు నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో గాంధీ ఆస్పత్రికి తరలివెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలు సంజయ్, గోపినాథ్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు.రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శనకు వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు నిపుణులైన డాక్టర్లుగా తాము గాంధీ ఆస్పత్రికి వెళ్తామంటే ప్రభుత్వం ఎందుకు ఆపుతుందని కమిటీలోని నాయకులు ప్రశ్నించారు. గాంధీ ఆస్పత్రిలో మా పార్టీ ప్రస్తావించిన మాతా శిశు మరణాల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతుందా? లేదంటే తమ పరిపాలన వైఫల్యం బయటకు వస్తుందని భయపడుతుందా? అని నాయకులు అంటున్నారు.కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ముగ్గురు డాక్టర్లతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశామని కేటీఆర్ వెల్లడించారు. అయితే ఈ కమిటీ ఆస్పత్రుల్లో ఇబ్బందులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతుందన్నారు. కానీ నిపుణుల కమిటీ ఆస్పత్రిలోకి వెళ్లకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుందో తెలియజేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం దయనీయమైన స్థితిలో ఉందని, డెంగ్యూ వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. ఇలాంటి వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తుందో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజాలను దాచలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలపై పోరాటం చేసే వరకు ఆగదని ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేశారు.