సిరా న్యూస్,విజయవాడ;
ఏపీవ్యాప్తంగా ఎన్నికల మూడ్ ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కు 43 రోజులే ఉంది. దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అటు ప్రచార పర్వం సైతం ప్రారంభమైంది. ఈ తరుణంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. గెలుపోటములపై విశ్లేషణలు సైతం ప్రారంభమయ్యాయి. వైసిపిది ఒంటరి పోరు కాగా.. టిడిపి,జనసేన, బిజెపి కూటమి కట్టాయి. దీంతో హోరా హోరి పోరు తప్పేలా లేదు. అయితే ఏపీ ప్రజల నాడీ ఎలా ఉందో మాత్రం తెలియడం లేదు. ఎవరికీ అంతుపట్టడం లేదు.ఇప్పటికే ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. సంక్షేమ పథకాలకు అలవాటు పడినవారు ఒక అభిప్రాయంతో ఉండగా.. అభివృద్ధికి సంబంధించి మధ్యతరగతి, ఎక్కువ మధ్య తరగతి వారు మరో అభిప్రాయంతో ఉన్నారు. జగన్ సంక్షేమ పాలనా అందిస్తాడని, చంద్రబాబు అభివృద్ధి చేస్తారని మొగ్గు చూపిన వారు ఉన్నారు. మూడు పార్టీలు కూటమి కట్టడంతో.. నచ్చిన వారు ఉన్నారు. నచ్చని వారు ఉన్నారు. ఇలా ఏపీలో ప్రజలంతా రకరకాలుగా విడిపోయారు. అందుకే ఎవరి వైపు ప్రజల మొగ్గు అధికంగా ఉంటుందనేది చెప్పడం కష్టతరంగా మారింది. అయితే ఈ 45 రోజులలో ప్రజాభిప్రాయం మారిపోతుందా? అంటే చెప్పడం కష్టం.గత ఐదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వ వైఖరిని నచ్చినవారు ఆయనకు మద్దతుగా నిలుస్తారు. నచ్చని వారు తప్పకుండా వ్యతిరేకిస్తారు. అయితే సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేశారు గనుక వారంతా జగన్ కు ఓటు వేస్తారని ఒక అంచనా. అంతకుమించి సంక్షేమ పథకాలు అందిస్తామని చంద్రబాబు చెబుతుండడంతో అటువైపు సైతం ప్రజలు తప్పకుండా మొగ్గు చూపుతారు. మరోవైపు అభివృద్ధి లేదన్న అపవాదు ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. వారు కచ్చితంగా వైసీపీని వ్యతిరేకిస్తారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. పేదల్లో అట్టడుగు వర్గాలు కచ్చితంగా జగన్ వైపు మొగ్గు చూపుతారు. ఈ సమాజం ఏమైపోని అనే రీతిలో వారు ఉంటారు. తమకు పథకాలు వచ్చాయా? లేదా? అన్న విషయాలనే వారు పరిగణలోకి తీసుకుంటారు.ఏపీ సమాజంలో విభిన్న వర్గాలు ఉండడం.. వారి అభిప్రాయాలు ఒక్కో రీతిన ఉండడం.. గెలుపోటములను అంచనా వేయడం చాలా కష్టతరంగా మారింది. ఫలానా పార్టీ గెలుస్తుంది.. ఓడిపోతుంది అని చెప్పడానికి వీలు లేని పరిస్థితి ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం. ప్రజలు మాత్రం డిసైడ్ అయ్యారు. అదే రీతిన విభజించబడ్డారు… వారి అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయి. అందుకే అంచనాలకు అందని పరిస్థితి. అలాగని ఈ 40 రోజుల్లో వారి అభిప్రాయాన్ని మార్చే మంత్రదండం సైతం ఎవరి దగ్గర ఉండదు అన్న విషయం గుర్తుంచుకోవాలి.