కూటమిలో బీజేపీ లెక్కేంటీ

సిరా న్యూస్,విజయవాడ;
తెలంగాణలో జనసేన చవిచూసిన దారుణ ఓటమి ఏపీలో ప్రభావం చూపుతుందా? కచ్చితంగా కొంత డ్యామేజ్ అయితే ఉంటుంది. తెలంగాణలో జనసేన పోటీ చేయడం ఇదే మొదటిసారి. 8 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీట్లో కూడా గెలవలేదు. కనీసం డిపాజిట్లు దక్కలేదు. 8 మంది అభ్యర్ధులకు వచ్చిన ఓట్లన్నీ కలిపితే 59వేలు మాత్రమే. అది కూడా బీజేపీతో పొత్తులో ఉండి. పోనీ, జనసేన వల్ల బీజేపీకి ఏమైనా లాభం జరిగిందా అంటే.. అదేం లేదు. గ్రేటర్‌లో బలం ఉందనుకున్న పార్టీకి కేవలం ఒకే ఒక్క సీటు వచ్చింది. ఓవరాల్‌గా జనసేన ఓట్లు బీజేపీకి వెళ్లలేదు, బీజేపీ ఓట్లు జనసేనకు రాలేదు. పేరుకే పొత్తు తప్ప రెండు పార్టీల మధ్య ఓట్‌ షేరింగ్‌ జరగనేలేదని అర్ధం. టీడీపీతో జరిపే సీట్ల చర్చలో తెలంగాణ ఓటమి కచ్చితమైన ప్రభావం చూపిస్తుందంటున్నారు కొందరు. ఎందుకంటే.. పవన్‌ కల్యాణ్‌ను సీఎంగా చూడాలనేది జనసేన కార్యకర్తల ఆరాటం. కాని, సంస్థాగతంగా తమ బలం ఎంత అన్నది అభిమానులు, కార్యకర్తలు ఆలోచించడం లేదు. పవన్‌ను చూసుకుని పార్టీ చాలా బలంగా ఉందని చెప్పుకోవడం తప్ప ఆ అభిమానం ఓట్లుగా మారవు అని గత ఎన్నికల్లోనే అర్థమైంది. నిజానికి తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే రిఫ్లెక్ట్ అయింది. తెలంగాణలో జనసేనకు బలమైన ఓటు బ్యాంక్‌ ఉందని ఆ పార్టీ చెప్పుకుంది. ఆ బలం చూసుకునే ఎన్నికలకు ఒంటరిగా వెళ్తామని మొదట ప్రకటించింది కూడా. తెలంగాణలో 32 సీట్లలో పోటీకి రెడీ అయింది. చివరికి 8 సీట్లలోనే పోటీ చేసింది. కాని, ఆనాడు జనసేన చెప్పిందేంటంటే.. కనీసం 25 అసెంబ్లీ స్థానాల్లో బలమైన ఓటు బ్యాంక్ తమ సొంతం అని. కాని, ఎన్నికల ఫలితాలు చూస్తే.. 8 మంది పోటీ చేసినా అందరికీ కలిపి 60వేల ఓట్లు కూడా రాలేదు. అంటే, మాటలు, ప్రకటనల్లో మాత్రమే జనసేనకు బలం తప్ప.. వాస్తవానికి ఆ పార్టీ పరిస్థితి ఏంటో గణాంకాలే చెబుతున్నాయి. రేప్పొద్దున టీడీపీతో సీట్ల గురించి చర్చించేటప్పుడు కూడా ఈ టాపిక్‌ రాకుండా ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. జనసేనకు మహా అయితే ఓ పాతిక సీట్లు ఇస్తారనే చర్చ జరిగినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు టీడీపీపై మండిపడ్డారు. అందుకే, పవన్ కల్యాణ్ కూడా గౌరవప్రదమైన సీట్లు అడుగుతాం అన్నారు. చంద్రబాబు అరెస్టై జైల్లో ఉన్నప్పుడు.. ముందు వెనక ఆలోచించకుండా పొత్తుకు రెడీ అని ప్రకటించడంతో జనసేనపై టీడీపీలో సానుభూతి పెరిగింది. కష్ట సమయంలో తమకు తోడుగా ఉన్నారు కాబట్టి మరో పది సీట్లు ఎక్కువ ఇచ్చినా ఫర్వాలేదనే ఆలోచన టీడీపీ కార్యకర్తల్లో వచ్చింది. కాకపోతే, అలాంటి సమయంలో తెలంగాణలో పోటీ చేయడం, దారుణంగా దెబ్బతినడంతో.. బేరం మళ్లీ పది సీట్ల నుంచి గానీ మొదలవుతుందా అనే చర్చ జరుగుతోంది.సరే.. సీట్ల షేరింగ్ రెండు పార్టీల మధ్య జరిగే అవగాహనను బట్టి ఉంటుంది. కాని, తెలంగాణలో జనసేన ఓటమిని అధికార పక్షం అంత తేలిగ్గా వదులుతుందా? కచ్చితంగా వదలదు. ఆయన రెండు చోట్ల పోటీ చేసినా గెలవలేదు, తెలంగాణలోనూ అభ్యర్ధులను గెలిపించుకోలేదు అనే విమర్శ వస్తుంది. దీనికి జనసేన సిద్ధపడాల్సి ఉంటుంది. అయితే, బీజేపీ మాత్రం ఏ రాష్ట్ర పరిస్థితులు దానివే అంటోంది. తెలంగాణలో ఆదరించకపోయినంత మాత్రాన.. అదే సెంటిమెంట్‌ ఏపీలోనూ రిపీట్ అవుతుందని చెప్పలేం అంటోంది బీజేపీ.తెలంగాణలో జనసేన ఓటమి ఏపీలో పెద్దగా ప్రభావం చూపించదు అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా కూడా. ఎందుకంటే, తెలంగాణలో పవన్ కల్యాణ్ పెద్దగా ప్రచారం చేసింది లేదు. అంత ఎఫర్ట్ కూడా చూపించలేదు. తెలంగాణలో తమ పార్టీ బలం ఏంటో తెలుసు కాబట్టే పవన్ చివరి నాలుగు రోజులు మినహా ప్రచారానికి వెళ్లలేదని అందరికీ తెలుసు. సో, తెలంగాణలో ఓటమిని ఏపీలో పట్టించుకోకపోవచ్చు అనేది ఓ అంచనా. అటు టీడీపీ కూడా ఓటమిని సాకుగా చూసే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఓటమిని టీడీపీ అసలు కన్సిడర్‌ చేయకపోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *