సిరాన్యూస్, ఇచ్చోడ
భార్యను కడతేర్చిన భర్త
* పరారీలో భర్త
కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భార్యను భర్త కడతెర్చిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సట్వాజిగూడకు చెందిన రేణుక (29) తో ఇచ్చోడ మండలం జున్ని గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన గుట్టే వెంకటితో 2015 వ సంవత్సరంలో వివాహం జరిగింది. 8 సంవత్సరాల తర్వాత కూతురు జన్మించింది. తండ్రి ఉత్తం, చిన్నాన్న శివాజీ తో కలిసి వెంకటి గాంధీనగర్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. వెంకటి మద్యం తాగి రోజు భార్య రేణుకతో గొడవ పడుతుండేవాడు. దీంతో రేణుక పుట్టింటికి వెళ్ళిపోయింది. తర్వాత వెంకటి పెద్దల సమక్షంలో వారి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి మళ్లీ తిరిగి భార్య రేణుకను ఇంటికి తీసుకువచ్చాడు. అయితే ఐదు నెలల క్రితం వెంకటి తల్లి మృతి చెందింది. బీమా డబ్బులు ఐదు లక్షల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బులతో వెంకటి కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టాడు. నిత్యం తాగుతూ ఆ డబ్బులతో జల్సాలు చేస్తున్నాడని అతని భార్య రేణుక డబ్బులు ఖర్చు చేయొద్దని భర్త వెంకటితో వారించేది. ఈ డబ్బులు చాలకపోతే మేకలను అమ్ముతాను అనగా ఇదే విషయమై భార్య భర్తలు శనివారం రాత్రి గొడవపడ్డారు. వెంకటి భార్య రేణుకను తాడుతో బిగించగా.. రేణుక చనిపోయింది. వెంకటి పరారయ్యాడు. ఆదివారం ఉదయం 6 గంటలకు మాధవ్. చరవాణిలో మృతురాలి సోదరుడు కేంద్రే సాయినాథ్ కు రేణుక ఇంటిలో చనిపోయి ఉన్నదని తెలిపాడు. వెంటనే మృతురాలి సోదరుడు కేంద్రే సాయినాథ్ వచ్చి చూడగా.. రేణుక మెడకు తాడుతో గట్టిగా బిగించి ఉండగా ఊపిరాడక చనిపోయిందని గమనించాడు. మృతురాలి సోదరుడు కేంద్రే సాయినాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ప్రస్తుతం నాలుగు నెలల పాప ఉంది.