సిరా న్యూస్, డిజిటల్:
ఈ సారి డొల్లార ఇసుక ఎవరి సొంతం?!
+ ఆదిలాబాద్లో అధికారం మారడంతో సర్వత్రా ఉత్కంఠత
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని చిన్న గ్రామమైన డొల్లార పేరు చెబితే తెలిసిన వారందరికి మొదటగా గుర్తుకు వచ్చేది అక్రమ ఇసుక తవ్వకాలనే చెప్పవచ్చు. ఈ అక్రమ ఇసుక రీచ్ 44వ నంబరు జాతీయ రహాదారికి కూత వేటు దూరంలో ఉండటంతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో ఉండటంతో దీనికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ నాణ్యమైన ఇసుక లభించడమే కాక వహానాల రాకపోకలకు చాలా అనువుగా ఉండటంతో ప్రతీ ఏట వేలం పాటలో రూ. 30–50 లక్షలకు ఈ రీచ్ అమ్ముడుపోతూ వస్తున్నది. గత 15సంవత్సరాలుగా కొంత మంది కింది స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ తవ్వకాలు చేపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మైనింగ్, పోలీసులు, రెవెన్యూ అధికారులు అడపదడపా దాడులు, వహానాల సీజ్ చేయడంం తప్ప పెద్దగా చేసిందేమి లేదనేది బహిరంగ రహాస్యమే. కొంత మంది నాయకులు డొల్లార, కామాయి వీడీసీల పేరు చెప్పి, ప్రతీ ఏట వేలం పాట నిర్వహిస్తూ వస్తున్నారు. గత సంవత్సరం నిర్వహించిన వేలం పాటలో ఏకంగా రూ. 50లక్షలు చెల్లించి మరీ కొంత మంది ఈ రీచ్ను స్వంత చేసుకోవడం అప్పట్లో హల్చల్గా మారింది. ప్రస్తుతం అటు రాష్ట్రంలోనూ, ఇటూ ఆదిలాబాద్లోనూ బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో, ఇసుకాసురులు ప్రస్తుతం డైలామాలో ఉన్నారు. ఏట ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా చేస్తూ కోట్లు గడించిన కొంత మంది నాయకులకు ప్రస్తుతం ఏం చేయాలో అర్థం కాక తలలుపట్టుకుంటున్నారు.
ఈ సారి ఎవరికీ?
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కింది స్థాయి నాయకులు, బీఆర్ఎస్ సానుభూతి పరులు ఇసుక కింగ్లు గా ఎదిగారు. పొరపాటున వేరే పార్టీల నాయకులు వేలంపాటలో రీచ్లు దక్కించుకొని ధందా చేస్తే మాత్రం, తరుచు దాడులు, గ్రామస్తుల లొల్లిలతో తవ్వకాలు జరిగే పరిస్థితి ఉండేది కాదు. దీంతో 15ఏళ్లు బీఆర్ఎస్ పేరు చెప్పుకొని కొంత మంది లీడర్లు ఇసుక తవ్వకాలే ప్రధానంగా కోట్లు గడించారు. అయితే ప్రస్తుతం అదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గెలుపొందడం, రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. కేవలం డొల్లార వద్ద మాత్రమే కాకుండా జైనథ్ మండలంలోని పెండల్వాడ, సాంగ్వి, ఆనంద్పూర్, కౌఠ, బేల మండలంలోని సాంగిడి, తదితర గ్రామాల్లో ఉన్న అక్రమ ఇసుక రీచ్లు ఎవరిని ఎవరిని వరించనున్నాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో లాగానే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆయా పార్టీల కింది స్థాయి లీడర్లు ఇసుక ధందాలో దిగుతారా? అసలు రెండు పార్టీల నడుమ ఇసుక ధందా కొనసాగుతుందా? అనే సందేహాలు నెలకొన్నాయి.
ఇసుక కోసమే పార్టీల ఫిరాయింపు…
గతంలో బీఆర్ఎస్ జమానాలో ఇసుక ధందా నడిపించి కొంత మంది ద్వితీయ శ్రేణి నేతలు ప్రస్తుతం బీఆర్ఎస్కు టాటా చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొంత మంది బీఆర్ఎస్ను వీడి కాంగ్రేస్ తీర్థ పుచ్చుకోగా, మరికొంత మంది సిద్దంగా ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్లో ఉంటే ఇసుక ధందా చేసుకోలేమని భావించిన కొంత మంది లీడర్లు బీజేపీ గానీ, కాంగ్రేస్ గూటికి గాని చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఇసుక ధందా ఇక మీదట ఏలా ఉండబోతుందనేది ఇప్పుడే స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. ఈ అంశంపై ఆయా పార్టీల ఆదిలాబాద్ అగ్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. టెక్నికల్గా అవకాశం ఉంటే మాత్రం ఈ ఇసుక రీచ్లకు లీగల్గా లైసెన్స్ జారీ చేస్తే అటు ఖాజానాకు రాబడి రావడమే కాకుండా, అందరికి ఉపయోగంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.