సిరా న్యూస్, బేల:
అర్హులందరికీ ఇండ్లు కట్టిస్తాం…
-ఎమ్మెల్యే పాయల్ శంకర్
స్వంత ఇండ్లు లేని నిరుపేదలందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు నిర్మించి ఇస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం ఉపాశ్ నాల గ్రామంలో ఐటీడీఏ నిధులు తో నిర్మిస్తున్న 10 ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో అమలు చేయకుండా అడ్డుకున్నదని విమర్శించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇకమీదట అర్హులైన పేదలందరికీ ఇండ్లు కట్టించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉపాశ్ నాలలో నిర్మిస్తున్న 10 ఇండ్ల పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు గ్రామంలోని కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. తాను ఎమ్మెల్యేగా గెలవడానికి కృషిచేసిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు దత్తా నిక్కం, నాయకులు సంజయ్, పోతరాజ్ నవీన్, రాము బర్కడే, కదరపు ప్రవిన్, జీవన్, సందీప్ ఠాక్రే, ప్రమోద్ రెడ్డి, ప్రదీప్ ఖోడే, గ్రామస్తులు పాల్గొన్నారు.