బాలశిక్ష కార్య క్రమాన్ని పకడ్బందీగా అమలు చెయ్యా లి

సిరా న్యూస్,నిర్మల్;

బాలశక్తి కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేయాలని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బాలశక్తి కార్యక్రమం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, బాలశక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 6 నుండి 12 తరగతుల విద్యార్థులకు ఆరోగ్యం, ఆర్ధిక అక్షరాస్యత, క్షేత్ర పర్యటన అనుభవాలు, నైపుణ్య అభివృద్ధి, సాధికారత వంటి అంశాలపై అవగాహన కల్పించడం బాలశక్తి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ప్రజా పాలన దినోత్సవం రోజున రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యచే కార్యక్రమ పోస్టర్ల ను ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు వివిధ విభాగాలలో నైపుణ్యాలను, నిత్యజీవితంలోని రోజువారి కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించేందుకు ఈనెల 20వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా 52 విద్యాసంస్థల్లో బాలశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. విద్యార్థులకు బ్యాంకింగ్ విభాగంలో అందించు వివిధ రకాల సేవలు, సైబర్ నేరాల పట్ల అవగాహన, గ్రామ, మండల స్థాయిలో పౌర సేవలకు సంబంధించి అంశాలను వివరించడం, జిల్లా కార్యాలయాల సందర్శన, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, న్యాయస్థానం, గ్రామపంచాయతీ, మండల కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మీసేవ, అంగన్వాడీ కేంద్రాలు, కుటీర పరిశ్రమలు, ప్రాజెక్టులు, వ్యవసాయ పరిశోధన క్షేత్రాలకు విద్యార్థులను క్షేత్ర స్థాయిలో తీసుకువెళ్లి 20 మంది బృందం చొప్పున పలు సేవల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పాఠశాలల్లో వైద్య శిబిరాలు ఏర్పరచడం ద్వారా విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ తయారుచేసి, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, పౌష్టికాహారం, వ్యాధులు, వాటి నియంత్రణ, ఒత్తిడిని జయించుట, స్వీయ రక్షణ వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాలల పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామీణ మండల స్థాయి అధికారులు, ఎన్జీవోలు, ఆశా కార్యకర్తలు, మహిళా స్వయం సంఘాలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. జిల్లా విద్య, వైద్య ఆరోగ్య, పరిశ్రమలు, లీడ్ బ్యాంకు మేనేజర్, గ్రామీణ అభివృద్ధి, ఆశా కార్యకర్తలు, ఎన్జీవోలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఈఓ రవీందర్ రెడ్డి, డిఆర్డిఓ విజయలక్ష్మి, డిఎఎంహెచ్ఓ రాజేందర్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
===================================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *