మంత్రి తుమ్మల
సిరా న్యూస్;హైదరాబాద్;
రైతులకు విత్తన సరఫరా మరియు తెలంగాణ విత్తన రంగ అభివృద్ధి పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి, వ్యవసాయ శాఖ, విత్తనధ్రువీకరణ సంస్థ మరియు విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో ముఖ్యంగా, వచ్చే సీజన్ లో రోజుల్లో రైతులకు విత్తన సరఫరా మరియు నాణ్యమైన విత్తన లభ్యత (ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న) పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ రైతులకు విత్తన లభ్యతలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని అధికారులను మరియు విత్తన కంపెనీలను ఆదేశించారు. విత్తన సరఫరాలో తెలంగాణ రైతులకు అధికప్రాధాన్యత ఇచ్చి, మిగతా విత్తనాలను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసుకోవాలని కంపెనీలకు సూచించారు. అదేవిధంగా, రాష్ట్రంలో నకిలీ విత్తనాల సరఫరా లేకుండా చూడాలని, అలాంటి వారిపై కఠిన చర్యలుతీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల వలన రైతులకు ఏదైనా నష్టం జరిగితే విత్తన కంపెనీలు తగిన నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలీ సూచించారు.