సిరా న్యూస్,శ్రీశైలం;
భక్తుల సౌకర్యార్థం శ్రీశైల క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రోజు కార్యనిర్వహణాధికారి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పలు ప్రదేశాలు పరిశీలించారు. రోడ్లు భవనాలశాఖ అతిథిగృహ కూడలి, ఘంటామఠం కూడలి, విభూతిమఠం కూడలి, వలయరహదారి, పాతాళగంగరోడ్డు, పాతాళగంగ పాతమెట్ల రోడ్డు,సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మొదలైన ప్రదేశాలను
పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రోడ్లు భవనాల శాఖ అతిథిగృహం కూడలి వద్ద వీలైనంత మేరకు రహదారిని ఇరువైపులా విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రుద్రాక్షమఠం, విభూతిమఠం వద్దగల కూడళ్ళ వద్ద గల రహదారిని విస్తరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. రుద్రాక్షమఠం, విభూతిమఠం ప్రాంగణాల ముందు స్వల్ప విస్తీర్ణ ప్రదేశంలో ల్యాండ్ స్కేపింగ్ గార్డెనింగ్ చేపట్టాలని ఉద్యానవన అధికారి లోకేస్ ను ఆదేశించారు. భక్తులు సులభంగా ప్రవేశించేందుకు వీలుగా ఆలయ పుష్కరిణి సమీపంలో గల శంకరవనం(రాక్ గార్డెన్ ) దక్షిణభాగంలో కూడా ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రపరిధిలో రహదారికి ఇరువైపులా ఎప్పటికప్పుడు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టి పిచ్చిమొక్కలను తొలగిస్తుండాలన్నారు. క్రమం తప్పకుండా ఈ జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టాలన్నారు. క్షేత్రపరిధిలోని అన్నీ కూడళ్ళ వద్ద ఆయా దారులు తెలిసేవిధంగా మరిన్ని సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కూడళ్ళలో ఆయా మార్గసూచికలు స్పష్టంగా కనిపించేందుకు వీలుగా కాంటిలివర్ బోర్డులు ఏర్పాటు చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. అన్నీ కూడళ్ళ వద్ద తగిన మేరకు విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాలని ఎలక్ట్రికల్ విభాగాన్ని ఆదేశించారు.