ఒక్క నిమిషం ఆలస్యమైనా…నాట్ ఎలౌ
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను ఇంటరోబోర్డు ఇప్పటికే అందుబాటులో ఉంచినసంగతి తెలిసిందే. వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 4,78,718 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. ద్వితీయ సంవత్సరం నుంచి 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. సెకండియర్ పరీక్షలకు హాజరయ్యే వారిలో 58,071 మంది ప్రైవేట్ విద్యార్థులున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 సెంటర్లను అధికారులు ఏర్పాటుచేశారు. వీటిలో 880 సెంటర్లను ప్రైవేట్ కాలేజీల్లో, 407 సెంటర్లను ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో, మరో 234 సెంటర్లను గురుకులాల్లో ఏర్పాటు చేశారు. ఇక పరీక్షల కోసం 27,900 మంది ఇన్విజిలేటర్లు, విధులు నిర్వర్తించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, సిబ్బందిని పరీక్షల విధుల్లోకి తీసుకొంటున్నట్టు వివరించారు. కలెక్టర్లు, పోలీసు అధికారులు పరీక్షాకేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. చీఫ్ సూపరింటెండెంట్లు-1,521 మంది; ఫ్లయింగ్ స్కాడ్-75 మంది; సిట్టింగ్ స్కాడ్ – 200 మంది విధులు నిర్వహించనున్నారు.
ప్రశాంతంగా పరీక్షలు రాయండి : ఇంటర్ బోర్డ్ కార్యదర్శి
విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి శృతి ఓజా సూచించారు. పరీక్షల నేపథ్యంలో ఆమె సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అన్నిశాఖలతో సమన్వయం చేసుకుని.. గతానికి భిన్నంగా పరీక్షలు నిర్వహించాలని తాము సంకల్పించినట్టు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, డ్యూయల్డెస్క్ బెంచీలు వంటి వసతులు కల్పించామని తెలిపారు.
వెబ్సైట్లో ఇంటర్ పరీక్షల హాల్టికెట్లు..
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంచారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎస్సెస్సీ లేదా మొదటి ఏడాది హాల్టికెట్ నంబరుతో థియరీ పరీక్షల హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండో ఏడాది వారు మొదటి సంవత్సరం లేదా రెండో ఏడాది హాల్టికెట్ నంబరుతో డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్టికెట్లలో ఫొటోలు, సంతకాలు, ఇతర సవరణలు అవసరమైతే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి, సరిచేయించుకునే వెసులుబాటు ఉంటుంది.
విద్యార్థులకు కీలక సూచనలు..
➥ ఇంటర్ వార్షిక పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
➥ సెల్ఫోన్లపై కఠిన ఆంక్షలు విధించారు.
➥ మాల్ ప్రాక్ట్రీస్, కాపీయింగ్ను ప్రోత్సహించిన యాజమాన్యాలపై సెక్షన్ -25 ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటారు.
➥ ప్రతీ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది.