సిరా న్యూస్, నిర్మల్
జిల్లాల రద్దు ఆలోచన మానుకోవాలి : బీఎస్పీ నిర్మల్ జిల్లా ఇన్చార్జి అడ్వకేట్ జగన్ మోహన్
పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేసే ఆలోచన,కమిటీ వేస్తా అనడం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి విరమించుకోవాలని బీఎస్పీ నిర్మల్ జిల్లా ఇన్చార్జి అడ్వకేట్ జగన్ మోహన్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మల్ జిల్లా, జిల్లాలు రద్దు చేస్తే ప్రజా ఉద్యమాలు చేపడతామని అన్నారు. గత ప్రభుత్వం హయంలో పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలను కేసీఆర్ మీద ఉన్న కోపంతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రద్దు చేస్తానని, కమిటీ వేస్తానని ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదని అన్నారు. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి జిల్లా కార్యాలయాలు ఫర్నిచర్ ఏర్పాటు చేశారని, జిల్లాల రద్దు చేస్తే కోట్లాది రూపాయలు వృధా అయిపోతాయని అన్నారు. ఎంతోమంది ప్రజలకు, ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాల వల్ల చిన్న జిల్లాల వల్ల సుపరిపాలన జరిగి అభివృద్ధి తొందరగా చెందుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారని అన్నారు, ప్రభుత్వాలు మారొచ్చు కానీ ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ నష్టం చేసే విధంగా ఉండకూడదని అన్నారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కు ఉండకూడదు అనుకుంటే,గత ప్రభుత్వం చేసిన తప్పు విధానాలు చేయకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు. ఒకవేళ జిల్లాలు రద్దు చేస్తే సహించేది లేదని అన్నారు. ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని అన్నారు. సమావేశంలో జిల్లా ప్రదాన కార్యదర్శి డాక్టర్ రాజేశ్వర్, జిల్లా మహిమ కన్వీనర్ ఎస్కె లక్ష్మీ నియోజక వర్గ నాయకులు కాంతం సాగర్,జె. రాదిక తో పాటు నాయకులు పాల్గొన్నారు.