మునిసిపల్ కార్మికుల సమ్మె కు టిడిపి మద్దతు
సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ పాదయాత్ర సమయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన మాట తప్పి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. మాజీ కేంద్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారి* ఆదేశాల మేరకు బుధవారం స్థానిక మునిసిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు టిడిపి నేతలు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జగన్ పాదయాత్ర సమయంలో పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేసి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత విస్మరించడం మోసం చేయడమేనని ఆరోపించారు. గత నాలుగున్నర ఏళ్లుగా సహనం కోల్పోయే సమ్మెకు దిగారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంలో ఘోరంగా విఫలం చెందారని మండిపడ్డారు. ఆప్కాస్ తీసుకువచ్చి కార్మికుల నోట్లో మట్టి కొట్టారని ఆవేదన చెందారు. ఆప్కాస్ ఫలితంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఇతరులకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదని ఆవేదన చెందారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వకపోగా, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు దూరం చేశారని దుయ్యబట్టారు. కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్ గా పని చేసి మరణించిన కార్మికులకు వారి కుటుంబాలను ఆదుకునేలా రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించే క్లాప్ వాహనాలను నిర్వహిస్తున్న సంస్థలకు ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో గత ఏడు నెలల నుండి వాహనాల డ్రైవర్లకు జీతాలు చెల్లించలేకపోయారని దీంతో వారి కుటుంబాలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారని పేర్కొన్నారు. వీరికి జీవో నెంబర్ 7 ప్రకారం 18500 లు జీతాలు చెల్లించాలని కోరారు. కార్మిక సమస్యలు పరిష్కరించకపోవడంతో.. జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మొన్న అంగన్వాడీలు, నిన్న ఆశా వర్కర్లు, నేడు మున్సిపల్ కార్మికులు, రేపు వాలంటీర్లు సమ్మె చేస్తున్నారంటే పరిపాలన చేయడంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. కార్మిక,కర్షక, ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న జగన్ కు ఓటమితో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. చర్చల పేరుతో కాలయాపన చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. జగన్ దిమ్మ తిరిగేలా కార్మికులు సమ్మెను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమ్మె ఖర్చుల నిమిత్తం మునిసిపల్ మాజీ కౌన్సిలర్ మాచాని శివకుమార్ ఆర్థిక సహాయం ను పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి.అల్తాఫ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప్పర (సగర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, మునిసిపల్ మాజీ కౌన్సిలర్ మాచాని శివకుమార్, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, తెలుగు మహిళా నాయకురాలు గోకారమ్మ, టిడిపి ముస్లిం మైనార్టీ నాయకులు కె.యం.డి.జబ్బార్, ఆఫ్గాన్ వలి భాష, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు రోజా ఆర్ట్స్ ఉసేని, దర్జీ మోషన్న, జగతాప్ జయపాల్, సిఐటియు నాయకులు రాముడు, అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.రాజు, మునిసిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం నాయకులు అల్వాల నాగరాజు, కె. సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.