జగ్జీవన్‌రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకం

దేవినేని ఉమామహేశ్వర రావు

సిరా న్యూస్,మంగళగిరి;

స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఏపీ జలవనరుల శాఖ మాజీమంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర రావు కొనియాడారు. శుక్రవారం బాబూ జగ్జీవన్‌రామ్‌ 117వ జయంతి సందర్భంగా మంగళగిరి కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన సేవలను దేవినేని ఉమా స్మరించుకొన్నారు. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు మరియు పార్టీ నేతలతో కలిసి జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అత్యంత పేదరికంలో జన్మించిన బాబూ జగ్జీవన్‌రామ్‌ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని తెలిపారు. జాతీయోద్యమంలో పాల్గొన్న జగ్జీవన్‌రామ్‌ రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగానూ సేవలందించారని గుర్తు చేశారు. స్వాతంత్య్రానంతరం అనేక మంత్రి పదవులకు వన్నె తెచ్చారని పేర్కొన్నారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు జగ్జీవన్‌రామ్‌ పోరాడారని, దళితుల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారని కొనియాడారు. రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన పాత్ర ఎనలేనిది. దళితుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు. 1946లో జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ కేబినెట్లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడంలో జగ్జీవన్ రామ్ కీలకపాత్ర పోషించారు. జాతిపిత మహాత్మాగాంధీ అభిప్రాయాలతో జగ్జీవన్ రామ్ ఎక్కువగా ఏకీభవించేవారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి గాంధీ చేసిన ప్రయత్నాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ ముందున్నారు. సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారు. బాబూజీ అని పిలిపించుకున్న ఆయన నడిచిన బాట.. అనుసరించిన ఆదర్శాలు.. చూపిన సంస్కరణ మార్గాలనూ గుర్తుచేసుకుంటూ.. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *