తెలంగాణపై జనసేన ఫోకస్

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతోందా అంటే అవుననే అంటున్నాయిన పార్టీ శ్రేణులు. నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభానికి ఐదు రోజుల ముందు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ సమన్వయకమిటీ ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఏపీలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలో దిగాయి. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది.ఇక ఏపీలో జనసేన టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలోకి క్యూ కట్టారు. తమకు టికెట్లు ఇవ్వలేదనే బాధ కంటే.. పక్క పార్టీల నుంచి పిలిచి మరి టికెట్‌ ఇవ్వడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే పోతిన మహేష్, మనుక్రాంత్‌రెడ్డి, పితాని బాలకృష్ణ, పాముల రాజేశ్వరి సహా పలువురు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. మరికొందరు అదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో జనసేనాని అలర్టయ్యారు. మొన్నటి వరకు అసంతృప్తులపై కన్నెత్తి కూడా చూడని పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు.మరోవైపు జనసేనాని తెలంగాణపై కూడా ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. బొంగునూరి మహేందర్‌రెడ్డి సమన్వయకర్తగా, శంకర్‌గౌడ్, రాజలింగం, పొన్నూరి శిరీష, ప్రేమ్‌కుమార్, ములుకుంట్ల సాగర్‌ సభ్యులుగా ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 7 స్థానాల్లో పోటీ చేసిన జనసేన ఆశించినమేర సక్సెస్‌ కాలేదు. లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణలో ఖాతా ఓపెన్‌ చేస్తుందా లేదా అనేది చూడాలిఆంధ్రప్రదేశ్‌లోనే ఒంటరిగా పోటీ చేయడానికి వెనుకాడిన పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయరని విశ్లేషకులు అభిప్రాపయడుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని పోటీ చేయకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఏపీలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, ఇప్పటికే తెలంగాణలో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ పోటీకి దూరంగా ఉంది. ఈ క్రమంలో జనసేన హడావుడి చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రత్యక్షంగా పోటీ చేస్తారా లేక గతంలో లాగా ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది
================================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *