సిరాన్యూస్, ఆదిలాబాద్
బీఆర్ఎస్ పాలనలోనే పాఠశాలలు అభివృద్ధి: మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
* భుక్తాపూర్లో బడిబాట కార్యక్రమం ప్రారంభం
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు మనబడి.. మన బస్తీ పథకాలతో పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అధునాతన సౌకర్యాలు కల్పించి ఉన్నత విద్య కోసం ప్రోత్సహించడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జ పట్టణంలోని వార్డ్ నెం 49 భుక్తాపూర్ లో గల ప్రైమరీ స్కూల్లో బడిబాట కార్యక్రమాన్ని వార్డ్ కౌన్సిలర్ ప్రకాష్ తో కలిసి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రారంభించారు. ఈసందర్బంగా విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు దుస్తులను అందజేశారు. అనంతరం చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ పాఠశాలల పునర్నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రత్యేక సౌకర్యాలను గత బిఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. అలాగే ప్రతి పేద, బడుగు బలహీనవర్గాల కుటుంబాల పిల్లలకు సైతం ఇంగ్లీష్ విద్యను డిజిటల్ తరగతుల బోధనను అందించడం జరిగిందన్నారు. అలాగే పోషకాలతో కూడిన మార్నింగ్ సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం తో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తూ ఉన్నత విద్యకు పాటుపడిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో ప్రణీత, డీఎస్డీఓ వెంకటేశ్వర్లు, కమిషనర్ కమర్ హైమద్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.