సిరా న్యూస్, ఆదిలాబాద్:
ప్రధాని మోడీకి జోగు రామన్న బహిరంగ లేఖ
+ గత హామీలు నెరవేర్చాలని డిమాండ్
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా మాజీ మంత్రి టిఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి సంబంధించి కేంద్రం పరిధిలో ఉన్న అంశాలపై ప్రధాని తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం పరిధిలోని సీసీఐను వెంటనే పునరుద్ధరించాలని, ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్, విమానాశ్రయం, పత్తి ఆధారిత పరిశ్రమలు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అంశాలపై కేంద్రం స్పందించలేదని అన్నారు. గతంలో అనేక మార్లు సీసీఐ పునరుద్ధరణ విషయాన్నీ కేంద్రం దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. మాజీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సీసీఐ ను సందర్శించి త్వరలోనే ప్రారంభిస్తామని ఇచ్చినా హామీ ఆచరణకు నోచుకోలేదన్నారు. గతంలో తమ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించడాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ఆదిలాబాద్ అభివృద్ధి పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సోమవారం జరగనున్న బహిరంగ సభలో జిల్లా వాసులు ఏళ్ళుగా ఎదురుచూస్తున్న డిమాండ్లపై ప్రధాని మోడీ స్పందించి, అవసరమైన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.