Jogu Ramanna Asks: రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైంది..?

సిరా న్యూస్, బోథ్:

రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైంది..?

– బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న

డిసెంబర్ 9న రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటివరకు రుణమాఫీ ఎందుకు చేయలేదని బిఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. మంగళవారం తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి గొడం నగేష్, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు వారిని ఘనంగా పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీని కూడా సక్రమంగా అమలు చేయకుండా, రెండు గ్యారంటీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటానని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చేస్తానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *