సిరాన్యూస్, ఆదిలాబాద్
హామీలు నెరవేర్చకపోతే పోరాటాలు చేస్తాం : మాజీ ఎమ్మెల్యే జోగురామన్న
ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెర వేర్చాలని, లేని పక్షంలో పోరాటాలు చేస్తామని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. శనివారం బీఆర్ ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రైతు దీక్ష చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద జరిగిన దీక్షలో పార్టీ శ్రేణులతో పాటు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలతో ఆరుకాలం కష్టపడే రైతులను నట్టేట ముంచేస్తుందన్నారు. అన్నదాతలు ఏళ్ళుగా ఎదుర్కుంటున్న కష్టాలను దూరం చేసి వారిని అక్కున చేర్చుకున్నామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ప్రవేశపెట్టిన రైతుబందు పథకం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ఆరోపించారు. రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటె తక్షణమే వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయిందని అన్నారు. రైతుబందు నగదును రైతుల ఖాతాల్లో ఇప్పటికీ జమ చేయడం లేదని, రైతు కూలీలకు ఆర్ధిక సహాయం హామీ సంగతేంటని ప్రశ్నించారు. పుష్కలంగా సాగు నీరు ఉన్నప్పటికీ వాటి సరఫరాలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దాదాపు ఇరవై వేల ఎకరాల వరి పంట నష్టం జరిగిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటించిన సమయంలో సాగు నీరు సరఫరా చేయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని ఇచ్చిన హామీని సైతం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ జన్మదినం నుండి అమలు చేస్తామన్న రుణమాఫీ హామీ నాలుగు నెలలైనా అమలు కాలేదన్నారు. పంటలను బోనస్ తో కొనుగోలు చేస్తామన్న మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, అదేవిధంగా మూడు లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలను మంజూరు చేయాలనీ డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో ప్రత్యేక బడ్జెట్ విధానం అమలు చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల పరిహారం అందించడంతో పాటు 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయని పక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపట్టి వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.ధర్నాలో మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్, ఎంపీపీ లు మర్శెట్టి గోవర్ధన్, గండ్రత్ రమేష్, నేతలు యూనుస్ అక్బని, అలాల్ అజయ్, యాసం నర్సింగ్ రావు, రోకండ్ల రమేష్, మెట్టు ప్రహ్లాద్, నారాయణ, వేణుగోపాల్ యాదవ్, స్వరూప రాని మమతా, కౌన్సిలర్లు లతో పాటు ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, రైతులు పాల్గొన్నారు.