సిరాన్యూస్, ఆదిలాబాద్
రాంజీ గోండ్ సేవలు మరువలేనివి : మాజీ మంత్రి జోగురామన్న
గిరిజనుల హక్కుల సాధనకోసం పోరాడిన రాంజీ గోండ్ సేవలు మరువలేనివని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. రాంజీ గోండ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని బస్ స్టాండ్ ఎదుట గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు ఆదివాసి సంఘాల నేతలు రాం జీ గోండ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆదివాసీ, గిరిజనుల హక్కుల సాధనకోసం పోరాడి ప్రాణాలు అర్పించిన రాంజీ గోండ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. రాంజీ గోండ్ పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఆంగ్లేయుల పాలనలో అనేక ఉద్యమాలు చేసిన ఘనత రాం జీ గోండ్ కు దక్కుతుందని, ఆ మహనీయుడు చూపిన బాటలో నడవాలని అన్నారు.కార్యక్రమంలో నాయకులు సిడం రాం కిషన్, రోకండ్ల రమేష్, కుమ్ర రాజు, మెట్టు ప్రహ్లాద్, విజ్జగిరి నారాయణ, రాజ్జన్న, ఆశన్న,తదితరులు పాల్గొన్నారు.