Joguramanna:ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్ర‌భుత్వం విఫ‌లం : మాజీ మంత్రి జోగురామ‌న్న‌

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్ర‌భుత్వం విఫ‌లం : మాజీ మంత్రి జోగురామ‌న్న‌
* బీఆర్ఎస్ లో పలువురు చేరికలు

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి రోజున అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నివాళి అర్పించకపోవడం సరైంది కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఇటివల కాంగ్రెస్ లో చేరిన పలువురు నేతలు తిరిగి గులాబి గూటికి చేరగా… వారికి కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. బేల మండలం సైద్పూర్ మాజీ సర్పంచ్ రోహిత్ దాస్ తో పాటు గోపాల్, రాం లాల్, సంతోష్ తదితరులు మాజీ మంత్రి జోగురామన్న సమక్షంలో బీఆర్ ఎస్‌ లో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమని వెళ్ళిన నేతలకు నిరాశే ఎదురవుతోందని అన్నారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని గత ప్రభుత్వ హయంలో నిర్మిస్తే ఆ మహనీయుని జయంతి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహం వద్ద నివాళి అర్పించక పోవడాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలోనూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పలు మార్లు అవమానించిన విషయాన్నీ గుర్తు చేశారు. అదేవిధంగా పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ రోహిత్ దాస్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో ఉంటె స్థానికంగా అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో బీ.ఆర్.ఎస్ ను వీడినట్లు తెలిపారు. కాంగ్రెస్ లో కేవలం ధనికులకు మాత్రమే గుర్తింపు ఉందని ఆక్షేపించారు. చేసిన తప్పును తెలుసుకుని తిరిగి గులాబీ గూటికి చేరామని పేర్కొన్నారు.కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, గంభీర్ టాక్రే, ప్రమోద్ రెడ్డి, సతీష్ పవార్, విపిన్, దేవన్న‌, తన్వీర్, దత్తు మధుకర్ , ప్రతాప్.తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *