సిరాన్యూస్, జైనథ్
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత :మాజీ మంత్రి జోగురామన్న
* సమస్త ప్రజానీకం సుభిక్షంగా జీవించాలి
* కేదార్ పూర్లో ఘనంగా హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కేదార్ పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆంజనేయ స్వామిని ప్రత్యేక హారతులతో కొలిచి… వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. హోమాది క్రతువుల్లో పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకల వివరాలను ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ హనుమాన్ ఆలయ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పన్నెండు లక్షల నిధులను కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. ఆలయాల నిర్మాణాలు, అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాలను నిర్మిస్తూ ఆధ్యాత్మిక వేడుకలను అట్టహాసంగా జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సన్మార్గంలో నడుస్తూ. ప్రశాంత జీవనాన్ని గడపలన్నారు. ఆంజనేయ స్వామి కృపతో సమస్త ప్రజానీకం సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు.