సిరాన్యూస్, ఆదిలాబాద్
రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం సరికాదు : మాజీ మంత్రి జోగురామన్న
* బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది
* అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించే బీఆర్ఎస్కు పట్టం కట్టాలి
బీజేపీ కి ఓటమి భయం పట్టుకుందని, ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. భైంసాలో నిర్వహించిన రోడ్ షో లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భైంసా రోడ్ షో లో జరిగిన దాడి పక్క ప్రణాళిక ప్రకారం జరిగిందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగోట్టాలన్న ఉద్దేశంతోనే దాడి చేయించారని ఆరోపించారు. శ్రీ రాముడిని, ఆంజనేయ స్వామిని తామంతా గౌరవిస్తామని స్పష్టం చేసిన ఆయన… దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ భైంసా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ ఎంఐఎం పార్టీకి ఓటు వేసిన మాట నిజం కాదా అని అన్నారు. ఈ విషయాన్నీ హిందూ సంఘాలు ఏ విధంగా సమర్దిస్తాయని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ ఆదివాసి గిరిజనులకు, జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానిపై చేసే విమర్శలను బీజేపీ ఖండించక పోవడం పట్ల ఆంతర్యం ఏంటని అన్నారు. ఓటమి భయంతో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజంసం కాదని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించే బీఆర్ఎస్ కు ఎన్నికల్లో పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ ఎన్నికల వేళ బీజేపీ చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. నామినేషన్ మొదలు పెండల్ వాడాలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాతే నామినేషన్ చేశారని గుర్తు చేశారు, ప్రజల్లో మొదలైన మార్పుని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో ఇలాంటి మత ఘర్షణలకు బైంసా ప్రాంతాన్ని అక్కడ బీజేపీ పక్క ప్రణాళికతో చేస్తున్నట్టే కనిపిస్తుందని పేర్కొన్నారు.సమగ్ర అభివృద్ధి సాధ్యం కావాలంటే అది బీఆర్ఎస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలోపట్టణ అధ్యక్షులు అజయ్ రోకళ్ళ రమేష్, మార్కెట్ మాజీ చైర్మన్ మెట్టు ప్రలాద్, కౌన్సిలర్ భూమన్న, నవాతే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.