Joguramanna: ఆదివాసి సంక్షేమానికి తొలి ప్రాధాన్యత బీఆర్ఎస్

సిరాన్యూస్‌,బేల‌
ఆదివాసి సంక్షేమానికి తొలి ప్రాధాన్యత బీఆర్ఎస్
* మ‌హనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి
* బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న
* ఆదివాసిల‌తో క‌లిసి సంద‌డి చేసిన జోగురామ‌న్న‌
* భీం విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌
జల్, జంగల్, జమీన్ నినాదంతో పోరాడిన ఆదివాసి పోరాటయోధుడు కొమరం భీం ఆశయాలకు అనుగుణంగా గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం ఆదివాసి సంక్షేమానికి తొలి ప్రాధాన్యతను ఇచ్చిందని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం మసాలా గ్రామంలో ఏర్పాటు చేసిన కొమరం భీం విగ్రహాన్ని శనివారం ఆయన లాంచనంగా ఆవిష్కరించారు. గ్రామస్తుల సమక్షంలో భీం విగ్రహాన్ని అట్టహాసంగా ఆవిష్కరించి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదివాసి సంప్రదాయాలకు అనుగుణంగా వారితో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆదివాసిల సాంప్రదాయ ప్రదర్శనలను తన సెల్ ఫోన్ లో బంధించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జోడే ఘాట్ కు వచ్చి కొమరం భీం కు నివాళి అర్పించిన తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లోనూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేసిన విషయాన్నీ గుర్తు చేశారు. పదవి ఉన్నా, లేకపోయినా చేసిన మంచి పనులు ఎప్పటికీ నిలిచిపోతాయని స్పష్టం చేశారు. ఆదివాసి పోరాట యోధుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేశామని పునరుద్ఘాటించారు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటు పడుతూ మెరుగైన సమాజ నిర్మాణానికి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, సతీష్ పవార్, ఆడే శంకర్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *