సిరాన్యూస్, ఆదిలాబాద్
బీజేపీని ఓడించడమే సీపీఐ లక్ష్యం : సీపీఐ రాష్ట్ర నాయకులు కలవేణి శంకర్
* ఆత్రం సుగుణను గెలిపించాలంటూ నేతల పిలుపు
* సెంట్రల్ గార్డెన్లో సీపీఐ జనరల్ బాడీ సమావేశం
* హాజరైన ఎంపీ అభ్యర్థి సుగుణ, అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి
బీజేపీని ఓడించడమే మన ముందున్న లక్ష్యమని, ఆ దిశగా అందరూ శక్తివంచనలేకుండా కృషి చేసి కాంగ్రెస్ గెలుపులో భాగస్వాములు కావాలని నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సెంట్రల్ గార్డెన్లో సీపీఐ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఆపార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణి శంకర్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలపై ఇరు పార్టీల శ్రేణులకు వారు దిశా నిర్దేశం చేశారు. బీజేపీని ఓడించి ఇంటికి పంపడమే ఏకైక ఎజెండాగా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి ఘన నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, సీపీఐ నాయకులు విలాస్, ముడుపు నళినిరెడ్డి, కుంటాల రాములు, అరుణ్ కుమార్, ఆత్రం భాస్కర్, వినోద్, మానవ హక్కుల వేదిక అధ్యక్షులు ఆత్రం భుజంగ్రావు, మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్, కాంగ్రెస్, సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పోల్ మేనేజ్మెంట్ ముఖ్యంః కంది శ్రీనివాసరెడ్డి
ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పోలింగ్ శాతం పెంచాల్సిన అవసరముందన్నారు. ఎండల కారణంగా ఉదయం వేళల్లోనే పోలింగ్ ఎక్కువగా జరిగేలా చూడాలన్నారు. పదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ మాటలతోనే కడుపు నింపాడని ఆరోపించారు. ఇప్పటివరకు కేంద్రం మనకు చేసిందేమీలేదని దుయ్యబట్టారు. ఈ పదేండ్లలో పేదలకు ఎన్ని ఇండ్లు కట్టించారో చెప్పాలన్నారు. ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో సమాధానం ఇవ్వాలని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కేవలం మాటలతో మభ్యపెట్టడం తప్పా గొప్పగా ఏంచేయలేదని మండిపడ్డారు. ఈ వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆ పార్టీ విధానాలను ఎండగట్టాలని అన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే అవినీతిపై ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఈ ఎన్నికలు చారిత్రాత్మక విలువ గలవన్నారు. పార్టీల విధానాలు ఏవైనా ప్రజా సంక్షేమమే అసలైన సిద్ధాంతం కావాలని అన్నారు. తన మొదటి ఓటును అప్పట్లో సీపీఐ అభ్యర్ధి సురవరం సుధాకర్ రెడ్డికి వేశానని గుర్తు చేశారు. ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో సీపీఐ మంచి క్రమశిక్షణ గల పార్టీ అంటూ కొనియాడారు. ప్రజల మద్దతును కూడగట్టి బీజేపీని ఇంటికి పంపాలని అన్నారు. ఇక్కడ సీసీఐని తెరిపించే విషయంలోగానీ, ఆదిలాబాద్- ఆర్మూర్ రైల్వేలైన్ విషయంలోగానీ బీజేపీ ఏం చేసిదంటూ నిలదీశారు. ఆసియా ఖండంలోనే అత్యధికంగా పత్తి పండించే ఈ ప్రాంతంలో టెక్స్టైల్ పార్కు అవసరముందున్నారు. కానీ బీజేపీ అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఎంతసేపు మత రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి పేరు చెప్పుకుని పబ్బం గడుపుకుంటోందన్నారు. నగేష్ ఎంపీగా ఉండి ఈ ప్రాంతానికి ఏం చేశారంటూ ప్రశ్నించారు. పొరపాటున మళ్లీ బీజేపీని గెలిపిస్తే అదే కష్టాలు, నష్టాలు చవిచూడక తప్పదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఈ ప్రాంత ప్రజలు అనుకున్న ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల కరపత్రాలు, స్టిక్కర్లు ఇంటింటికీ చేర్చాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన సీపీఐ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికలలో 48 వేల పై చిలుకు ఓట్లు సాధించేలా కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదే ప్రేమతో వచ్చే లోక్సభ ఎన్నికలల్లోనూ ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆదరించి గెలిపిస్తే ప్రజల గొంతుకనై నినదిస్తాః ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆదరించి, అక్కున చేర్చుకుని గెలిపిస్తే ప్రజల సమస్యలపై గళమెత్తి నినదిస్తానని, లోక్సభలో తనవాణిని బలంగా వినిపిస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు.కాంగ్రెస్కు మద్దతిస్తున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్, సీపీఐ కలిసి మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. తన జీవితం ప్రజా సేవకే అంకితమని అన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఒక సామాన్యురాలిగా ప్రజల కష్టసుఖాలు తెలిసిన మనిషిగా వారికి ఏదైన చేయాలనే ఉద్దేశంతోనే ఎంపీగా బరిలోకి దిగుతున్నట్టు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఒక పేదింటి బిడ్డకు, మహిళకు టికెట్ ఇచ్చిందన్నారు. అందరూ మీ ఆడబిడ్డగా, తోబుట్టువుగా భావించి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ప్రశ్నించే గొంతుకగాతాను పార్లమెంట్ లో పోరాడతానని తెలిపారు.
కాంగ్రెస్ అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతుః కలవేణి శంకర్, సీపీఐ రాష్ట్ర నాయకులు
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రస్తుతం జరుగుతున్న పోరాటంలో సీపీఐ చాలా ముఖ్యపాత్ర పోశిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణి శంకర్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలపై దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా మతతత్వ బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు గెలుపు కోసం తమ సంపూర్ణ మద్దతు, సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ప్రజల తరపున పోరాడే ఒక మహిళకు ఎంపీ సీటు ఇవ్వడం నిజంగా అభినందనీయమన్నారు. అత్యధిక మెజార్టీతో ఆమెను గెలిపించుకోవడం కోసం అహర్నిషలు కష్టపడాలన్నారు.