వారంలో కళ్యాణ లక్ష్మీ మార్గదర్శకాలు

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో.. ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే.. ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పొందుపర్చిన అధికారులు.. వాటిని వడపోసి అర్హుల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు.. ఆయా పథకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు.. గత ప్రభుత్వం ఇచ్చిన లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వగా.. అందుకు అంచనాలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరో నాలుగు రోజుల్లో కళ్యాణలక్ష్మి ప్రకటన చేయనున్నట్టు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు.ఇదిలా ఉంటే.. లోక్‌సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుపై కూడా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్‌ ఛానెల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళికలు రచించాలని సూచించారు. మరోవైపు.. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలాలలు గుర్తించాలని.. గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.ఈ మేరకు.. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *