సిరాన్యూస్, ఆదిలాబాద్
విత్తనాల కోసం రైతులు ఆందోళన వద్దు: కంది శ్రీనివాసరెడ్డి
* అందుబాటులో రైతులకు సరిపడా విత్తనాలు
ఎలాంటి విత్తనాల కొరత లేకుండా, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, ఎవరూ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని పలు విత్తన దుకాణాలను ఆయన సోమవారం సందర్శించారు. రైతులకు విత్తనాలు అందుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఎన్ని కావాలంటే అన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వారికి భరోసా కల్పించారు. డిమాండ్ రకం రాశి 659తోపాటు ఇతర బ్రాండెడ్ విత్తనాలు సైతం ఉన్నాయని, వాటిని పంపిణీ చేసేందుకు డీలర్లు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందని, విత్తనాలను జిల్లాకు సరఫరా అయ్యేవిధంగా కంపెనీతో మాట్లాడిందని తెలిపారు. వ్యవసాయశాఖ ఈ విషయంలో పటిష్టంగా పనిచేస్తోందన్నారు. రైతుల డిమాండ్కు అనుగుణంగా విత్తనాలను జిల్లాకు సరఫరా చేసిందని తెలిపారు. ఎవరికి ఎన్ని కావాలన్నా తీసుకెళ్లవచ్చని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతు క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, ఎలాంటి లోటుపాట్లు ఉన్నా సవరించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లా రైతాంగం విత్తనాలను విత్తుకుని అధిక దిగుబడులు సాధించాలని, ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, ఎస్టీ సెల్ చైర్మెన్ షెడ్మకి ఆనంద్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, కయ్యుం, చంటి, తదితరులు పాల్గొన్నారు