సిరా న్యూస్, ఆదిలాబాద్
ఎన్నికల్లో గెలుపోటములు సహజం: కంది శ్రీనివాసరెడ్డి
* కాంగ్రెస్ కు ఓటేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు
* ఓటింగ్శాతం పెరగడం హర్షణీయం
ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగనిరీతిలో ఓటింగ్ శాతం పెరగడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.రెండు లక్షల 50 వేలు మైనస్గా ఉన్న ఓట్లను 78 వేలకుపైగా సాధించేందుకు శ్రమించిన నాయకులు, కార్యకర్తల కృషిని ఆయన కొనియాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, పెరిగిన ఓటింగ్ శాతం రానున్న ఎన్నికలకు దోహద పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తమ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణకు ఓటు వేసిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలకు అన్నివేళలా తాను అండగా ఉంటానని, ఓటమికి ఎవరూ నైరాశ్యం చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలు ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. అటు దేశంలోనూ మోదీ మానియాకు ధీటుగా ఇండియా కూటమి దూసుకెళ్లిందన్నారు. ఓటర్లు విభిన్నమైన తీర్పునిచ్చి ఇండియా కూటమికి రెండు వందలపైగా సీట్లను కట్టబెట్టారన్నారు. కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెళ్లి శ్రీధర్, కౌన్సిలర్ కలాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్రావు, లోక ప్రవీణ్రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.