సిరా న్యూస్, ఆదిలాబాద్
మరో మారు కాంగ్రెస్ ను చీల్చే కుట్ర
* తిప్పికొట్టాలని కంది శ్రీనివాస రెడ్డి పిలుపు
* ఆదిలాబాద్ లోక్ సభ స్థానం కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యం
* ప్రజాసేవాభవన్ లో నియోజకర్గ శ్రేణులతో సమావేశం
కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని చీల్చే కుట్ర మరో మారు జరుగుతున్నదని కాంగ్రెస్ శ్రేణులందరు అప్రమత్తతతో దాన్ని తిప్పికొట్టాలని ఆ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతలకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయం ప్రజా సేవాభవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు ,కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. తాను లేని సమయంలో కొంత మందిని వెనుకేసుకుని నాయకుడిలా చెలామణి అయ్యేందుకు చేస్తున్నకుట్రపై కంది శ్రీనివాస రెడ్డి ఫైరయ్యారు. వెనుకుండి వెన్నుపోటు పొడిచే నాయకులు పార్టీలో కొందరున్నారని పరోక్షంగా అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు. సదరు నాయకుల వెనుక ఎవరున్నారో ప్రజలకు అర్ధ మైందన్నారు. ఇదంతా జోగు రామన్న ఆడిస్తున్న నాటకంగా అభివర్ణించారు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో నలుగురిని అడ్డంపెట్టుకొని కుట్రలకు పాల్పడ్డాడని అనంతరం వారి పరిస్థితి ఏమయ్యిందో అందరికీ తెలుసునన్నారు. త్రిశంఖు స్వర్గంలో వారు ఊగిసలాడుతున్నారని విమర్శించారు.ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ మరో కుట్రకు జోగురామన్న సిద్ధపడి పావులను తయారుచేసుకుంటున్నారని, ఎన్నికల తర్వాత వీరి పరిస్థితి కూడా త్రిశంఖు స్వర్గమయ్యే అవకాశముందని అన్నారు.కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి అన్యాయం చేయాలని చూస్తే కార్యకర్తలు సహించరన్నారు. తాను కొన్నిరోజులు ఇక్కడ లేక పోవడంతోనే తన బండారం బయటపడిందన్నారు. లేకుంటే వెంటే ఉండి వెన్ను పొడిచే నాయకులను గుర్తించడం కష్టమన్నారు. ఇప్పటికీ మించి పోయింది లేదని కార్యకర్తలెవరూ దిగులు చెందే అవసరం లేదన్నారు. తానెప్పుడూ పదవుల కోసం ఆశపడలేదని ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే ఆశపడ్డానని కంది శ్రీనివాస రెడ్డి చెప్పారు. తాను రాక ముందు వచ్చిన తర్వాత నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏంటో మీకు తెలుసునన్నారు.కొందరి స్వార్ధం మరికొందరి కుట్రల వల్ల ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యే ఉన్నానన్నారు. తాను ఓడినా ఇప్పటికీ అన్నదానం నిరంతరాయంగా సాగుతుందన్నారు. ఆంబులెన్స్ సేవలు కొనసాగుతున్నాయన్నారు. పేదలకు ఆదుకునే ప్రక్రియ ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఇంత పెద్ద క్యాంపు కార్యాలయం తను ప్రజలు కార్యకర్తలకోసమే కట్టించినట్టు తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో అంతా కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి ఎవరైనా అతని గెలుపుకు గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లోక్ సభ స్థానం కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు విశ్రమించకుండా
అలుపెరుగని పోరాటం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ముఖ్య నాయకులు ,జిల్లా కేంద్ర నాయకులు , నియోజకవర్గం నలుమూలనుండి తరలివచ్చిన మండల నాయకులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు