సిరా న్యూస్, ఆదిలాబాద్:
డ్రైనేజీల శంకుస్థాపనకు మోడీ రావడం హాస్యాస్పదం
– కంది శ్రీనివాసరెడ్డి
ఏళ్లుగా ఆదిలాబాద్ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా ఇప్పుడు కేవలం డ్రైనేజీల శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ కు రావడం హాస్యాస్పదమని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన కాంగ్రెస్ శ్రేణులు, బిఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నాయకులతో కలిసి పాల్గొన్నారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అదిలాబాద్ కు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ… 30 ఏళ్లుగా మూత పడిన సీసీఐ ని తెరిపించాలని, గిరిజనులు అధికంగా ఉండే జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. పత్తికి ప్రసిద్ది చెందిన ఆదిలాబాద్ లో ఏర్పాటు చేయాల్సిన టెక్స్ టైల్ పార్క్ ను వేరేచోటుకి తరలించారని ఆరోపించారు. విమానాశ్రయానికి తగిన స్థలం ఉండి కూడా నిర్మాణంలో కాలాయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న ఈ ఐదు డిమాండ్లకు రేపు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో గో బ్యాక్ మోదీ అంటూ నినదిస్తామని తెలిపారు. జిల్లాలో ఇన్ని సమస్యలు పెట్టుకొని కేవలం డ్రైనేజీలకు శంఖుస్థాపనకు ప్రధాని రావడం హాస్యాస్పదమన్నారు. జిల్లాకు ప్రధాని మోదీ వస్తున్నారంటే ఏళ్లుగా నెలకొని ఉన్న సమస్యలపై స్పందిస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని, మోదీ వీటిపై తగిన హామీ ఇవ్వాలని డిమాండ్ చేసారు.