సిరాన్యూస్, కుందుర్పి
కెంచంపల్లిలో వాటర్ ట్యాంక్ను శుభ్రం చేసిన టీడీపీ నాయకులు
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని జంబుగుంపల పంచాయతీ పరిధిలోని కెంచంపల్లి గ్రామంలోని మంచి నీటి ట్యాంకులను టీడీపీ నాయకులు శుభ్రం చేశారు. గత కొన్నినెలల నుంచి మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయడం లేదు. అందువల్ల గ్రామంలో శుభ్రం కానీ నీటిని తాగి వివిధ రకాల అనారోగ్య సమస్యలను స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్నారు. వాటర్ ట్యాంకుల పరిశుభ్రత గురించి స్థానిక టీడీపీ నాయకులు పలుమార్లు వైసీపీ సర్పంచ్కు సూచించిన పట్టించుకోలేదు. వైసీపీ సర్పంచ్ సూచనల మేరకు పనిచేస్తున్న గ్రామ పంచాయతీ, ఆర్డబ్ల్యూసీ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా నిర్లక్ష్యపు సమాధానాలతో కాలయాపన చేశారు. దీంతో ట్యాంకుల అపరిశుభ్రతకు నిలయంగా మారాయి. ఎన్నిసార్లు చెప్పిన అధికారులు పట్టించుకోకపోవడంతో స్పందించిన స్థానిక టీడీపీ నాయకులు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సేవా భావన స్పూర్తితో శ్రమదానం చేసి గ్రామంలో ఉన్న రెండు వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చాల్లారు. వాటి పరిసరాలలో క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ మెంబర్ కె. రామాంజినేయులు, మాజీ డీలర్ కె. లింగయ్య, మాజీ యానిమేటర్ ఎం. సంజీవులు, టీడీపీ నాయకులు సురేష్, ఎన్. సంజీవయ్య, సిద్దేశ్వర, హరీష్ తదితరులు పాల్గొన్నారు.