కేశినేని…దారెటు…

సిరా న్యూస్,విజయవాడ;
కేశినేని నాని టిడిపికి దూరమయ్యారు. త్వరలో రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆయన కుమార్తె శ్వేత సైతం కార్పొరేటర్ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తారని తేల్చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో చేరుతారా? లేకుంటే బీజేపీ నుంచి ఆహ్వానం ఉందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కానీ నాని మాత్రం ఫిబ్రవరి వరకు ఆగాలని చెబుతుండడంతో.. సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే ఆయన బిజెపిలో చేరేందుకు మొగ్గు చూపుతారని ప్రచారం జరుగుతోంది. రెండోసారి గెలిచిన తర్వాత టిడిపి కంటే బిజెపి నేతలతోనే ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఢిల్లీ రాజకీయాలు అంటే ఎక్కువగా ఆసక్తి చూపారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిశారు. అప్పటికే టిడిపి, బిజెపిల మధ్య పప్పు, నిప్పులా వ్యవహారం ఉంది. ఆ సమయంలో నాని వ్యవహరించిన తీరుతో చంద్రబాబు కూడా ఇబ్బంది పడ్డారు. హర్ట్ అయ్యారు. అంతటితో ఆగకుండా కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిశారు. నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. ఇలా ఏ విషయంలోనూ టిడిపి నాయకత్వానికి భయపడకుండా బీజేపీతో తన సన్నిహిత సంబంధాలను కొనసాగించారు.

అందుకే ఇప్పుడు టిడిపికి దూరమైతే కచ్చితంగా నాని బిజెపిలో మాత్రమే చేరతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు వైసీపీ సైతం కేశినేని నాని కోసం ప్రయత్నిస్తోంది. కానీ నాని మనసంతా బీజేపీ వైపు ఉంది. ఆయన జాతీయ రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పైగా తన మనస్తత్వానికి వైసీపీ సూట్ కాదని అనుచరుల వద్ద చెబుతున్నారు. బిజెపిలోకి వెళ్లడం ద్వారా స్వతంత్రంగా వ్యవహరించవచ్చని ఆలోచన చేస్తున్నారు. అయితే ఎన్నికల ముందే బిజెపిలో చేరాలా? లేకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి.. ఎంపీగా గెలుపొందిన తర్వాత చేరాలా? అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన తప్పకుండా బిజెపిలో మాత్రమే చేరతారని.. అక్కడ తనకు కావలసిన నాయకులు సైతం ఉన్నారని.. కాషాయ దళం లోనే తనకు అనువుగా ఉంటుందని కేశినేని నాని ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఫిబ్రవరి వరకు అందుకు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *