కిల్లర్ కైట్స్…

సిరా న్యూస్;
సాధారణంగా మనం వాడే దారం కాటన్ తో తయారవుతోంది. మన పనులను బట్టి దారాన్ని వాడుతూ ఉంటాం.. చివరికి ఆకాశాన్ని అంటే విధంగా ఎగరవేసే గాలిపటాల విషయంలోనూ కాటన్ తో తయారైన దారాలనే మనం వినియోగిస్తూ ఉంటాం. అయితే కొన్ని సంవత్సరాలుగా గాలిపటాలను ఎగరవేసేందుకు చైనా మాంజాను వాడటం మొదలైంది. అయితే ఈ మాంజా తయారీకి చైనీయులు పదునైన గ్లాసు ఉత్పత్తులు, ఇతర రసాయనాలు వాడుతున్న నేపథ్యంలో అవి ప్రాణాంతకంగా మారాయి. పక్షులకు, చివరికి మనుషుల ప్రాణాలు హరించే విధంగా తయారయ్యాయి. అందువల్లే చైనా మాంజాను ఎట్టి పరిస్థితిలో పతంగులు ఎగరవేయడానికి వాడకూడదని సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కంటికి కనిపించినటువంటి దారం ఉరితాడు లాగా మారి ఎన్నో ప్రాణాలను తీస్తూ.. కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగుల్చుతోంది. అన్యం పుణ్యం తెలియనటువంటి చిన్నారులతో మొదలుకుని.. పెద్ద వాళ్ళ వరకు ఈ దారం వారి కుటుంబాల పాలిట శాపంగా మారింది. అదే.. పతంగులు ఎగురవేసే.. చైనా మాంజ.. ప్రస్తుతం ఈ పేరు తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. సంక్రాంతి పండగ అనగానే గాలిపటాలు గుర్తొస్తాయి. దానితోపాటు అత్యంత ప్రమాదకరమైన చైనా మాంజా కూడా వణుకుపుట్టిస్తుంది. ప్రతి సంవత్సరంలోనే ఈ ఏడాది కూడా చైనా మాంజ కొందరి కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. కొంతమంది గాలిపటాలను ఎగరేస్తూ కరెంటు షాక్ తో చనిపోతే.. మరి కొంతమంది గాలిపటాలు ఎగురవేసే ప్రయత్నంలో బిల్డింగ్‌లపై నుంచి పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇలా గాలిపటాలు చాలా ప్రాణాలు గాల్లో కలిసేలా చేశాయి.అయినప్పటికీ ఏదో ఒక రూపంలో చైనా మాంజా మన దేశంలోకి వస్తున్నది. ప్రమాదాలకు కారణమవుతోంది. చైనా మాంజా వల్ల ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం.. ఇందులో ఒక ఆర్మీ జవాన్ కూడా ఉండటం దారుణాతీ దారుణం.హైదరాబాదులోని లంగర్ హౌస్ ప్రాంతంలో చైనా మాంజా మెడకు తగిలి ఓ ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. బైక్ మీద వెళ్తున్న ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డి మెడకు చైనా మాంజా తగిలింది. అది గొంతు భాగంలో లోతులో కోసేసింది. ఫలితంగా తీవ్రంగా రక్తస్రావం అయింది. ఆ రక్తస్రావానికి అతని దుస్తులు, బైక్ ముందుభాగం తడిచిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. కోటేశ్వర్ రెడ్డి స్వస్థలం విశాఖపట్నంలోని పెద్ద వాల్తేరు. ఈయన కొన్ని సంవత్సరాల నుంచి భారత ఆర్మీలో నాయక్ గా పని చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ఇటీవల హైదరాబాద్ ప్రాంతానికి బదిలీ అయ్యారు. రెండు సంవత్సరాల క్రితం ఆయనకు ప్రత్యూష అనే యువతితో పెళ్లయింది. వీరికి ఏడాదిన్నర వయసు ఉన్న భువిక అనే కుమార్తె ఉంది. కుమార్తె, భార్యతో కలిసి కోటేశ్వర్ రెడ్డి హైదరాబాదులో ఉంటున్నారు. భార్య కుమార్తెతో కలిసి శనివారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ మీదుగా బైక్ మీద కోటేశ్వర్ రెడ్డి వెళ్తుండగా.. చైనా మాంజా ఆయన మెడకు తగిలింది. కోటేశ్వర్ హెల్మెట్ ధరించినప్పటికీ సరిగ్గా గొంతు వద్ద మాంజా తగలడంతో బైక్ వేగానికి అది లోతుగా గాయం చేసింది.వాస్తవంగా చైనా మాంజాను మనదేశంలో నిషేధించారు. ఎందుకంటే వాటి తయారీలో చైనీయులు అత్యంత ప్రమాదకరమైన వస్తువులను వాడుతుంటారు.. ఆ మాంజాను వాడే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ఘటనల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. గతంలో ఈ చైనా మాంజా పక్షుల కాళ్లకు చుట్టుకుని చనిపోయాయి. అయితే దీనిపై రెడ్ క్రాస్, బ్లూ క్రాస్ వంటి సంస్థలు కోర్టును ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు చైనా మాంజాను మన దేశంలో నిషేధిస్తూ తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు నిషేధం విధించినప్పటికీ ఏదో ఒక రూపంలో చైనా మాంజా మనదేశంలోకి వస్తూనే ఉంది. దీనిని కొంతమంది వ్యాపారులు అక్రమంగా విక్రయిస్తున్నారు. అయితే ఈ మాంజా వల్ల జరిగే ప్రమాదాలు తెలియని కొంతమంది యువకులు దానిని విరివిగా వాడేస్తున్నారు. ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. చైనా మాంజాతో పతంగులు ఎగరవేసే వారి చేతులకు కూడా గాయాలవుతున్నాయి. ముఖ్యంగా ఈ మాంజా తయారీలో ముడి గాజు మిశ్రమాన్ని వాడటం వల్ల అది ప్రమాదాలకు కారణమవుతున్నది.ఇక ఈ చైనా మాంజా వల్ల ఒక ఆర్మీ జవాన్ మృతి చెందిన సంఘటన మర్చిపోకముందే.. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ముగ్గురు మృతి చెందారు. అత్తాపూర్ లోని ఓ 11 సంవత్సరాల బాలుడు భవనం పై పతంగి ఎగరవేస్తూ ఏసీ బాక్స్ కు తగలడంతో విద్యుత్ ప్రసారమైంది. ప్రమాద తీవ్రతకు ఆ బాలుడు అక్కడికక్కడే మరణం చెందాడు. ఇక ఇక కొంపల్లి నార్త్ ఎన్సీఎల్ క్యాస్కిడ్ గ్రీన్స్ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న ఏఎస్ఐ రాజశేఖర్ అల్వాల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారుడు, ఒక కుమార్తె. రాజశేఖర్ రెండవ కుమారుడు ఆకాష్ డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం అపార్ట్మెంట్ ఐదో అంతస్తు పై పతంగి ఎగరవేస్తుండగా అది రెండు అపార్ట్మెంట్ల మధ్య పడింది. పిట్టగోడ నుంచి కిందకు వంగుతూ ఆ పతంగిని తీసే ప్రయత్నంలో ఆకాశ్ పట్టుతప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలు అయిన అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. నాగర్ కర్నూల్ ప్రాంతంలో జోహాల్(12) అనే యువకుడు కూడా పతంగులు ఎగరవేస్తూ విద్యుత్ తీగల కు తగిలి దుర్మరణం చెందాడు. విద్యుత్ ప్రసార తీవ్రతకు ఆ యువకుడు ఎగిరిపడి మృతి చెందడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *