సిరాన్యూస్, భీమదేవరపల్లి
కొత్తకొండలో ప్రయివేట్ సంస్థల స్కూల్ బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు
భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలను మూసివేయకుండా భావితరాలకు పాఠశాల ఉపయోగపడే విధంగా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల సంఖ్యను పెంచడం, కోసం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో గ్రామస్తులు, యువజన అంతా కలిసి ఇతర గ్రామాల నుండి వచ్చే ప్రైవేట్ సంస్థల స్కూల్ బస్సులను శుక్రవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని, రాబోయే రోజులలో కొత్తకొండలోని ప్రభుత్వ పాఠశాల మూసివేసే పరిస్థితి వస్తుందని, ప్రైవేట్ స్కూల్ బస్సులను అడ్డుకొని, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యానభ్యసించిన ఎందరో విద్యార్థులు ప్రస్తుతం అన్ని రంగాలలో ఉద్యోగాలు సాధించి, సేవలందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యూత్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.