కోట్ల కామ్ అయిపోయారే…

సిరా న్యూస్,కర్నూలు;
కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ప్రస్తుతం ఆయన ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. డోన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ లో చేరిన కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తన కుటుంబ గౌరవం, ప్రతిష్ట కోసమైనా తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. డోన్ లో గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని గట్టిగా భావించారు. కానీ ఆయనకు కొన్ని కారణాల రీత్యా చంద్రబాబు మంత్రివర్గంలో స్థానంల దక్కలేదు. దీంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. నిజానికి ఆయన అనుకున్నది వేరు. జరుగుతున్నది వేరు. దీంతో అసలు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి టీడీపీలో ఉన్నారా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ప్రజలతో త్వరగా కలసిపోడన్న పేరున్నా .. ఆయన చాలా రోజుల తర్వాత శాసనసభకు పోటీ చేశారు. నిజానికి ఆయన కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయాలని ఉన్నా.. చంద్రబాబు డోన్ టిక్కెట్ ఇవ్వడంతో తప్పని సరి పరిస్థితుల్లో ఆయన శాసనసభకు పోటీ చేయాల్సి వచ్చింది. ఆయన ఎన్నికల వేళ నేరుగా కూడా ప్రజలతో చెప్పారు. తాను కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయాల్సి ఉందని, అయితే అనివార్య కారణాలతో పోటీ చేయలేకపోయానని కన్నీటి పర్యతంతమయ్యారు. అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చినా తనకు మంత్రి వర్గంలో స్థానం దక్కదని ఆయన ముందే ఊహించారా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.. నిజానికి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఎప్పుడూ శాసనసభ వైపు చూడలేదు. ఢిల్లీ వైపు ఆయన చూపు ఉంటుంది. పార్లమెంటు సభ్యుడిగా ఉంటే ఆ గౌరవం వేరు అని ఆయన భావిస్తారు. కుటుంబానికి ఉన్న ప్రతిష్టతో పాటు గౌరవం కూడా నిలబడుతుందని ఆయన ఆశిస్తారు. కానీ ఈసారి మాత్రం అలా జరగక పోవడంతో డోన్ నియోజకవర్గంలో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వచ్చింది. తీరా గెలిచిన తర్వాత కనీసం మంత్రి పదవి అయినా దక్కుతుందని భావిస్తే అది కూడా దక్కలేదు. కర్నూలు జిల్లా నుంచి టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డిలు మంత్రులుగా ఎంపిక చేేసుకోవడంతో కోట్ల సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. దీంతో పాటు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే కేఈ వర్గం కూడా గుర్రుమంటుందని చంద్రబాబు భావించి ఉండవచ్చు. అది కూడా ఆయనకు మైనస్ పాయింట్ గా మారిందనే చెబుతారు. అందుకే ఇటు కేఈ కుటుంబంలో గెలిచిన శ్యాంబాబుకు గాని, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి గాని మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు రెండు కుటుంబాలను పక్కనపెట్టారంటారు. ఈ నేపథ్యంలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి గెలిచిన తర్వాత యాక్టివ్ గా లేరు. ఆయన మాటే వినిపించడం లేదు. కేవలం డోన్ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. కర్నూలు జిల్లా రాజకీయాలకు కూడా ఆయన దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గెలిచి కూడా ఇంత నిరాశలో ఉన్నది కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మాత్రమేనంటూ కామెంట్స్ వినపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *